25-05-2025 12:11:50 AM
రాష్ట్రంలో ప్రభుత్వం వద్ద నిధుల కొరత వేధిస్తున్నా ఎలాగోలా పాలన నెట్టుకొస్తున్న సీఎం కేంద్రం సహకారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోభాగంగా అనేకమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను వెంటనే మంజూరు చేయాలని, పెద్ద మనసుతో నిధులు విడుదల చేయాలని కోరుతూ వస్తున్నారు.
అనేకమార్లు ఆయన హస్తినకు వెళ్లినా..ప్రధానిని కలిసినా ఫలితం మాత్రం రావడం లేదని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. శనివారం ఢిల్లీలో నీతిఆయోగ్ సదస్సుకు హాజరైన సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీని మరోసారి కలిసి రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రాజెక్టుల చిట్టా చదివి వినిపించారు. ఎప్పటిలాగే ప్రధాని మోదీ సీఎం చిట్టాను ప్రశాంతంగా విన్నారు.
కానీ ఆ ప్రాజెక్టుల్లో కనీసం ఒక్కటైనా వస్తుందా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. గతంలో ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్ టెండర్ల దశకు వచ్చినా కావాలనే కేంద్రం ఆపేసిందని చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు సక్రమంగా రావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈసారైనా సీఎం హస్తిన పర్యటనకు ప్రతిఫలం లభిస్తుందో లేదో చూడాలి మరి.
విజయ భాస్కర్