02-05-2025 12:00:00 AM
భారత్ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్) కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది కేంద్ర ప్రభు త్వం. వేవ్స్ అడ్వయిజరీ బోర్డులో టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటుడు చిరంజీవి సహా పలు ఇండస్ట్రీల నటీనటులు సభ్యులుగా ఉన్నారు. గురువారం ముంబయి వేదికగా ఈ సమ్మిట్ ప్రారంభమైంది.
నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో రజనీకాంత్, చిరంజీవి, మోహన్లాల్, అక్షయ్కుమార్, ఆమిర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై మాట్లాడిన మెగాస్టార్ తన సినీరంగ ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు. తనకు స్ఫూర్తిగా నిలిచిన పలువురు భారతీయ సినీతారలపై ప్రముఖ నటుడు చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఒక్కో విషయం లో ఒక్కొక్కరు తనలో స్ఫూర్తి నింపారని చెప్పారు.
“బాల్యంలో నేను డ్యాన్స్ చేసి కుటుంబాన్ని, స్నేహితులను అలరించేవాణ్ని. అలా నటనపై ప్రారంభమైన ఆసక్తి నన్ను చెన్నై వెళ్లేలా చేసింది. అలా నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికి పరిశ్రమలో ఎంతో మంది లెజండరీ యాక్టర్స్ ఉన్నారు. ‘ఇప్పటికే ఎంతో మంది సూపర్స్టార్స్ ఉన్నారు కదా.. ఇంకా అదనంగా నేనేం చేయగలనూ?! అనుకునేవాణ్ని. ఎలాగైనా అందరి దృష్టీ ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగాను.
1977లో నటనలో శిక్షణ తీసుకున్నా. అలా జర్నీ ప్రారంభించిన నేను మేకప్ లేకుండా సహజంగా నటించాలని మిథున్ చక్రవర్తి నుంచి నేర్చుకున్నా. స్టంట్స్ విషయంలో అమితాబ్బచ్చన్, డ్యాన్స్ విషయంలో నా సీనియర్ కమల్హాసన్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. అలా వారందరి సినిమాలు చూస్తూ, వారు నటించే విధానాన్ని పరిశీలిస్తూ నన్ను నేను మలుచుకున్నా” అని చెప్పారు.