05-12-2025 01:40:50 AM
చిట్యాల, డిసెంబర్ 4(విజయ క్రాంతి): గుండెపోటుతో ఐడియల్ కంపెనీలో పనిచేసే కార్మికుడు మృతి చెందిన సంఘటన చిట్యాల మండలంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రం లోని జాజ్పూర్ జిల్లా జలాల్పూర్ మండలం, నరకందాపూర్ గ్రామానికి చెందిన మనోజ్ జెన (42) వృత్తిరీత్యా చిట్యాల పట్టణ కేంద్రంలోని ఐడియల్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
ఈనెల 3న తాను పనిచేసే కంపెనీ రూము లో నిద్రిస్తుండగా రాత్రి ఒంటిగంట తర్వాత అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తనతో పాటు రూమ్ లో ఉన్న నరేష్ జన మరియు లేబర్ కాంట్రాక్టర్ రాజేష్ జన లు వెంటనే చికిత్స నిమిత్తం నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా తెల్లవారు జామున రెండున్నర గంటలకు వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ చేశారని, ఈ మేరకు మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవికుమార్ తెలిపారు.