ప్రతిపక్ష నేతగా గుర్తించండి
ఏపీ స్పీకర్కు జగన్మోహన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): వైఎస్సార్ సీపీకి తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్సీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ‘ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయలకు విరుద్ధం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదనే ముందుగా నిర్ణయించినట్లు ఉన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు.
ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లో ఉమ్మడి ఏపీలో ఈ నిబంధన పాటించ లేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంది. 1984లో లోక్సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 సీట్లు గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు లేకపొయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రతిపక్షనేతగా గుర్తించారు. ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశం’తో ఈ లేఖ రాస్తున్న అని పేర్కొన్నారు.






