31-08-2024 12:00:00 AM
మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు శివాజీ విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి. సింధ్దుర్గ్ జిల్లాలోని మాల్వన్ ఫోర్ట్లో గ త ఏడాది డిసెంబర్లో ఆవిష్కరించిన 35 అడుగుల ఎత్తయిన ఛత్రపతి శివాజీ విగ్రహం గత సోమవారం కూలిపోవడం ఈ వివాదానికి కారణం. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ స్వయంగా ఈ విగ్రహాన్నిఆవిష్కరించారు.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నౌకాదళం ఈ ప్రాజెక్టును అమలు చేసింది. అయితే విగ్రహం కూలడం ఇంత భారీ వివాదంగా మారుతుందని అప్ప ట్లో రాష్ట్రప్రభుత్వం ఊహించలేదు. సింధ్దుర్గ్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఆ కారణం గానే విగ్రహం కూలిపోయి ఉండవచ్చని మొదట్లో అధికార కూటమి వివరణ ఇచ్చింది.
కూలిన విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది. అయితే ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్పవార్కు చెందిన ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీలతో కూడిన ప్రతిపక్ష ‘మహా వికాస్ అఘాడీ’ కూటమికి ఇది బలమైన ఆయుధంగా మారింది. విగ్రహం ఏర్పాటులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆ కూట మి ఆరోపించింది. అంతేకాకుండా ఈ ఘటనకు రాష్ట్రప్రభుత్వం, నేవీ బా ధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు విగ్రహం కూలడంపై ఆదివారం ముంబయిలోని హుతాత్మ చౌక్నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాలని ప్రతిపక్ష నేతలు నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి ర్యాలీలే నిర్వహిస్తామని కూడా వారు ప్రకటించారు. మ హారాష్ట్ర ప్రజలకు ఛత్రపతి శివాజీ ఓ ఆరాధ్యుడు. రాష్ట్రంలోని ప్రతి జి ల్లాలో, అన్ని గ్రామాల్లో శివాజీ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు కూడా ఛత్రపతి శివాజీ పేరు ను రాజకీయాల్లో వాడుకుంటూ ఉంటాయి కూడా.
ఒకప్పుడు బాల్ థాక రే హయాంలో శివసేన శివాజీ పేరును చెప్పుకునే రాజకీయాలు చేసింది. ముంబయి నగర పాలక సంస్థ శివసేన చేతిలో ఉన్న సమయంలో విక్టోరియా టెర్మినస్ను ఛత్రపతి శివాజీ టెర్మినస్గా పేరు మార్చేసింది. అలాగే విమానాశ్రయానికీ ఛత్రపతి శివాజీ పేరుపెట్టింది. శివాజీ జయంతి వేడుకల నిర్వహణపైనా వివాదాలు కొనసాగాయి. ఇదంతా గుర్తుకు వచ్చిన అధికార ‘మహాయుతి’ నేతలు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. విగ్రహ నిర్మాణం కాంట్రాక్టర్ను అరెస్టు చేయడంతో పాటుగా విగ్రహం కూలడానికి గల కారణాలపై దర్యాప్తుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్లు విగ్రహం కూలడంపై రాష్ట్రప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు. అవసరమయితే వందసార్లు క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సీఎం అంటూ, శివాజీ పేరుతో రాజకీయాలు చేయవద్దంటూ ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. స్వయంగా ప్రధాని మోదీ సైతం విగ్రహం కూలడంపై రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరారు. ఛత్రపతి శివాజీని దైవంగా భావించే వారందరూ ఈ ఘటనతో ఆవేదనకు గురయ్యారని, వారందరికీ శిరసు వంచి క్షమాపణలు చెబుతున్నానని కూడా అన్నారు.
అయినా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యవహారం ఏ మేరకు తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందోనన్న భయం కూటమి నేతల్లో కనిపిస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార కూటమికి చావుదెబ్బ తగిలింది. మరోవైపు కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ వివాదం వీలయినంత త్వరగా ప్రజలు మరిచిపోయేలా చేయాలని ‘మహాయుతి’ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని తిరుగులేని అస్త్రంగా చేసుకోవాలని ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయి.