31-08-2024 12:00:00 AM
నా పరిశోధనకు మార్గదర్శకులై, నన్నొక కుటుంబ సభ్యునిగా భావించిన వేటూరి ఆనందమూర్తి అంటే నాకెంతో గౌరవం. ఆయన నాకు ఎంఏలో పాఠాలు చెప్పారు. ఎంఫిల్, పీహెచ్డీలకు పర్యవేక్షకులుగా ఉన్నారు. ఒక పదేళ్లపాటు ఆయనతో అనుబంధం కొనసాగించగలగడం నిజంగా నా అదృష్టమే. ఆయన ఓ యూలో తెలుగుశాఖాధ్యక్షులుగా ఉన్నప్పుడు అదే శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాను. ఎవరి దగ్గర చదువుకున్నానో, వారితోనే కలిసి పని చేయడం కంటే శిష్యులకు ఇంకో భాగ్యమేముంటుంది?
అది 1988వ సంవత్సరం. వేటూరి ప్రభాకరశాస్త్రి శతజయంతి ఉత్సవాలు హై దరాబాద్, తిరుపతి, బందరు ప్రాంతాల్లోనేకాక వారి స్వగ్రామమైన పెద్దకళ్లేపల్లిలో ను జరిగాయి. నేను ప్రభాకరశాస్త్రి రచనలను అన్నింటినీ సమీకరించి ప్రప్రథమం గా మా విశ్వవిద్యాలయంలో ‘వాజ్మయ సూచిక’ను తయారుచేశాను. అందుకు ప్రభాకరశాస్త్రి తనయులైన ఆనందమూర్తియే మార్గదర్శకులుగా ఉన్నారు. నేను ప్రభాకరశాస్త్రి శతజయంతి ఉత్సవాల్లో పూర్తిగా పాల్గొన్నాను. ఏ ప్రాంతంలో సభ జరిగినా మా గురువు ఆనందమూర్తి వా రు నన్ను అక్కడికి తీసుకొని వెళ్లేవారు.
వేటూరి వారు మాస్టర్ సి.వి.వి. శిష్యు లు. యోగమార్గంలో నడిచిన వారు. బ హుగ్రంథ కర్తలు. అన్నమయ్య సంకీర్తనల ను, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మతోపాటు వె లుగులోకి తెచ్చారు. ‘చాదస్తం లేని పండితులెవరైనా ఆనాటి కాలంలో ఉన్నారా?’ అంటే అది ప్రభాకరశాస్త్రి వారినే ఉదాహరణగా చెప్పాలి. వారి పీఠికలు రత్నపేటిక లు. వారి ‘శృంగార శ్రీనాథం’ అపూర్వమైన గ్రంథం. వారు ‘చాటు పద్యమణి మంజరి’ని రెండు భాగాల్లో అందించారు. అందు లోని చాటువులు విశ్వజనీనమైనవి.
తాళపత్ర గ్రంథాలను పరిశోధించాలన్నా, తాళ్లపాక అన్నమయ్య గురించి కొత్త విషయాల ను చెప్పాలన్నా, చివరికి ‘తాడిచెట్టు’ గురిం చి రాయాలన్నా, వేటూరి ప్రభాకరశాస్త్రి వారే రాయాలని పండితుల అభిప్రాయం. ‘బాల భాష’ పేరుతో వారు ప్రచురించిన గ్రంథంలో ప్రాచీనకాలంలో జానపదులు పాడుకొనే ఎనిమిది ‘కూనలమ్మ పదాలు’ సేకరించారు. వారి ‘తెలుగు మెఱుగులు’, ‘మీగడ తఱకలు’, ‘సింహావలోకనం’ అనే మూడు వ్యాస సంపుటాలు త్రివేణీ సంగమాన్ని తలపిస్తాయి. అమరావతీ స్తూపం మీదగల ‘నాగబు’ అనే పదాన్ని తెలుగుభాషలో లభించిన మొట్టమొదటి తెనుగు శాసనంగా నిర్ధారించారు ప్రభాకరశాస్త్రి వారు.
చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి శిష్యులైన వేటూరి ప్రభాకరశాస్త్రి వారు గురువు లాగానే కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. కవులు వట్టి కబుర్లు చెప్పి ప్రజల్ని రంజించడం కంటె వారిని పరమార్థం వైపు నడిపించాలని ఆకాంక్షించారు. కవిత్వాన్ని భగవంతునితో పోల్చిన రచయిత తెలుగు సాహిత్యంలో ఒక్క వేటూరి ప్రభాకరశాస్త్రి మాత్రమే ఉన్నారంటే అతిశయోక్తికాదు. అందుకు ఉదాహరణ:
“కవిత చింతపండు కాదు, మామిడి పండు
కాదు, కాదు వెండి, కాదు పైడి,
అమృత ధార, రేడియము, భగవంతుడున్
వలె సుదర్లభంపు వస్తువదియు.”
నేను చూసినంత వరకు అపారమైన పితృభక్తి కలిగిన ఆచార్యులలో ఆనందమూర్తి అందరికంటే ముందుంటారు. “సార్! మీరింత ప్రతిభావంతులు. స్వయం గా మీ నాన్నగారివలె రచనలు చేసి ప్రచురించవచ్చు కదా?” అని నేను ఆయనను అడిగాను ఒకసారి. దానికి ఆయన, “మా నాన్న నాకు జన్మనిచ్చాడు. అంతేకాదు, జ్ఞానాన్నిచ్చాడు. ఐతే, ఆయన జ్ఞానం కంటె నా జ్ఞానం గొప్పదని నేననుకోవడం లేదు. వారి ముందు నేనేమి రాసినా అది తక్కువే. అందుకే, నేను వారి రచనలను ప్రచురించే పనిలో ఉన్నాను” అని సమాధానం ఇచ్చారు. ‘మనం గొప్పగా రచనలు చేయలేనప్పుడు, గొప్పవారి రచనలను ప్రచారం చేయడమే మంచిది’ అన్న అభిప్రాయం ఆనందమూర్తి వారిది. తెలుగు సాహిత్యంలో తండ్రి రచనలను ఆయన వలె వెలుగులోకి తెచ్చిన వారు చాలా తక్కువమంది కనిపిస్తారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు కనుకనే ఆనందమూర్తి తొంభై ఏళ్లు దాటినా ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. సభా సమావేశాల్లో పాల్గొంటున్నారు.
వేటూరి ప్రభాకరశాస్త్రి శతజయంతి వే డుకల్లో భాగంగా కుమారులు ఆనందమూర్తి తమ స్వగ్రామమైన పెద్దకళ్లేపల్లికి ఎంతోమంది ప్రముఖ రచయితలను తీసుకొని వెళ్లారు. అందుకు వారొక బస్సునే క ట్టారు. నేను వారి శిష్యుణ్ణి కనుక ఆ బస్సు లో నేనుకూడా ఉన్నాను. బస్సు విహార యాత్రగాకాక విజ్ఞానయాత్రగా సాగింది. అందులో ‘ఎవరెవరు నాతో ఉన్నారు?’ అని చెప్పడం కంటే, ‘నేనెవరితో ఉన్నానని’ చెప్పడమే సముచితం. ఆనాటి ఆ బస్సులో తిరుమల రామచంద్ర, ఇరివెంటి కృష్ణమూర్తి, మంజుశ్రీ, పోచిరాజు శేషగిరిరావు, తిరుమల శ్రీనివాసాచార్య, వాకాటి పాండురంగారావు, మాడభూషి అనంతం, నాగిరెడ్డి మొదలైన వారితో నేను ప్రయాణించాను. బందరు సభలో నండూరి రామకృష్ణమాచార్యులు పాల్గొన్నారు. ఆ సభ రాత్రి పదిగంటల దాకా సాగింది. నాకక్కడ మాట్లాడే అవకాశం రాలేదు.
పెద్దకళ్లేపల్లిలో జరిగిన సభకు మద్రాసు నుంచి వేటూరి సుందర రామమూర్తి (సినీ గేయరచయిత) వచ్చారు. మూడు రోజులు వారితో కలిసి ఉండే భాగ్యం నాకు కలిగిం ది. సుందర రామమూర్తి వేటూరి ప్ర భాకరశాస్త్రి వారి కుమారులు. పెద్దకళ్లేపల్లి కృష్ణా జిల్లాలో ఒక అందమైన గ్రామం. పెద్దగోపురం కలిగిన శివాలయం ఆ గ్రా మానికే అలంకారంగా ఉంది. ఊరు చు ట్టూ అరటి చెట్లు. చక్కెర కేళీలు (అరటి పళ్లు) అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో కృష్ణానది ఉత్తర ముఖంగా ప్రవహిస్తుంది. ప్రభాకర శాస్త్రి అంత కమనీయంగా ‘తాడిచెట్టు’ గురించి రాశారెందుకనే ప్రశ్నకు వారి ఇంటి పెరట్లో ఉన్న ఎత్తయిన తాడిచెట్లే సమాధానం.
తండోపతండాలుగా జనం
పెద్దకళ్లేపల్లిలో శతజయంతి సభకు వేదిక సిద్ధమైంది. ఆ రోజు ఉదయం ఊరేగింపు జరిగింది. శాస్త్రి వారి చిత్రపటాన్ని నే ను, మిత్రులు నాగిరెడ్డి ఇద్దరం ఊరేగింపు జరిగినంత సేపు పట్టుకున్నాం. జయనాదాలు చేశాం. ఊరేగింపులో ఆ ఊరి ప్రజలు కొందరే పాల్గొన్నారు. అయినా, మేం ఉత్సాహంతో ఊరేగింపును విజయవంతం చేశాం. చక్కగా సాయంత్రం సభ మొదలవుతుందనుకున్నాను. కానీ, రాత్రి భోజనం చేసిన తర్వాతనే సభ మొదలైంది. హైద్రాబాద్లో అయితే రాత్రి 9 గంటల్లోపే సభ ముగిస్తాం. కానీ, అది ఊరు. ప్రజలు కాయకష్టం చేసి పగలంతా అలసిపోయి ఉంటారు. రాత్రి మాత్రమే వారికి తీరిక దొరికేది. ఇంతెందుకు, పూర్వకాలంలో హరికథలు, భాగవతుల ఆటలన్నీ రాత్రిపూటే జరిగేవి.
సభ సరిగ్గా రాత్రి 9 గంటలకు మొదలైంది. వేదిక మీద హైద్రాబాదు నుంచి వ చ్చిన ప్రముఖులతోపాటు చిన్నవాడినైన నేనూ ఉన్నాను. ‘ముసురు పెద్దవానగా ప రిణమించినట్లు’ సభకు జనం తండోపతండాలుగా వచ్చారు. బహుశా గ్రామం అం తా ఆ సభలో ఉన్నట్టనిపించింది నాకు. ఆ నందం పట్టలేక, ఆశ్చర్యంతో ఆనందమూ ర్తి వారిని అడిగానుె “నాన్నగారికి, ఈ ఊ రి జనానికి ఉన్న సంబంధం ఏమిటి సార్? ఇంతమంది సభకు రావడానికి ప్రగాఢమైన కారణమేమైనా ఉందా?” అప్పుడు ఆయన చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి.
“మా నాన్నగారు గాంధే యవాది. ఈ దేశం లోంచి అస్పృశ్యత అనేది పోయిననాడే అందరం బాగుపడిన ట్లు భావించాలని తలంచారు. గాంధీ చనిపోయిన రోజు అన్నం తినకుండా నిరశన వ్రతం పాటించారు. ఆ రోజు వారు పూర్తి మౌనంగా ఉండిపోయారు. ‘గాంధీ రామాయణం’ పేరుతో ఒక సంకలనం తెచ్చారు. అది అసంపూర్ణం. ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ఊరి శివాలయంలో అస్పృశ్యులకు మొదటిసారిగా ప్రవేశం కల్పించిన మహానుభావుడు మా నాన్న. అది గుర్తు పెట్టుకుని వారిమీది ప్రేమతో జనం ఈ సభకు వచ్చారు” అన్నారాయన.
- ఆచార్య మసన చెన్నప్ప
వ్యాసకర్త సెల్: 9885654381