31-08-2024 12:00:00 AM
టీఎస్ పీఎస్సీలో గతంలో ఉన్న రీలింక్విష్మెంట్ను మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికై తమకు కావలసిన ఒకదాన్ని ఎంపిక చేసుకుని మిగతా వాటిని వదులుకునే విధానమే రిలింక్విష్మెంట్. 2022 వరకు టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లలో అభ్యర్థులకు ఈ అవకాశం కల్పించారు. అయితే ఆ తర్వాత వచ్చిన నోటిఫికేషన్లలో తొలగించారు. రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ నియామక సంస్థలు అభ్యర్థులకు రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వాలి. గతంలో టీఎస్పీఎస్సీలో ఉన్న 6(ఏ) రూల్ను పునరుద్ధరించి అమలు చేయాలి. దీనివల్ల వేలమంది అభ్యర్థులకు మేలు జరిగి ఉద్యోగాలు వస్తాయి.
ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ ఒకే సారి వస్తుండడం, వరుస పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఒక అభ్యర్థికి ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో మరో అభ్యర్థికి నష్టం జరుగుతుంది. ఇలా ఇటీవల జరిగిన గురుకుల నియామకాల్లో అన్ని సొసైటీలు కలుపుకొని 3000కు పైగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు మిగిలిపోయాయి. అంటే మరో 3000 మంది అభ్యర్థులు ఉద్యోగాలను కోల్పోయారు. దీన్ని బట్టి ఈ సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుంది. త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
ఇందులో ప్రధానంగా గ్రూపు4, డీఎస్సీతో పాటు జేఎల్, ఏఈఈ, వెటర్నరీ సర్జన్ తదితర ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశలో ఉన్నందున త్వరలోనే ఆయా ఉద్యోగాల ఎంపిక జాబితా ప్రకటించి నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది.ఈ ఉద్యోగాల్లో 20 వేలకు పైగా జిల్లా కేడర్ ఉద్యోగాలే అయినందున అత్యధిక మంది అభ్యర్థులకు ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దీంతో వేల మంది నిరుద్యోగులు ఒకటి, అర మార్కులతో త్రుటిలో తప్పి ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లలో ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించింది.
ఇవే కాకుండా ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధించి రానున్న మూడు, నాలుగు నెలల్లో గ్రూపు1 మెయిన్స్, గ్రూపు 2, గ్రూపు3 పరీక్షలు జరగనున్నాయి. వీటన్నిటికీ దాదాపుగా సిలబస్ ఒకటే అయినందున వందలాది మంది అభ్యర్థులకు ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చి చాలా ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉద్యోగాలుగా మిగిలి పోతాయి. దీంతో ఇటు అభ్యర్థులకు, బ్యాక్లాగ్వల్ల అనుకున్న సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనందున అటు ప్రభుత్వం పాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. కావున ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి. అన్ని నియామక సంస్థల్లో రిలింక్విష్మెంట్ విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
మఠం శివానంద స్వామి, నారాయణ్ ఖేడ్