03-12-2024 12:00:00 AM
నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
ఒక వ్యక్తి దీర్ఘ-కాలంపాటు శారీరక, మానసిక, మేధో లేదా స్పర్శ బలహీనతలను కలిగి సమాజంలో తమ సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవడంలో విఫలమవడాన్ని ‘దివ్యాంగుల’ వర్గంగా చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా 16 శాతం జనాభా వికలాంగులు కాగా, వారు తమ జీవితాలను భారంగా గడుపుతున్నారు. అంతర్జాతీయంగా 80 శాతం దివ్యాంగులు అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉన్నారని, వీరిలో 46 శాతం వయోవృద్ధులు ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రతి ఐదుగురిలో ఒక మహిళ, ప్రతి 10 మందిలో ఒక బాలుడు అంగవైకల్య వలయంలో చిక్కుకుంటున్నారు. దివ్యాంగుల్లో సగం మందికి వైద్య సదుపాయాలు అందడం లేదని, 70 శాతం మందికి వీల్చైర్ అవసరం ఉందని, 90 శాతం మందికి వినికిడి పరికరాలు అందవలసి ఉందని తేలింది.
పౌర సమాజంలో దివ్యాంగులు నిరాదరణ, వివక్ష, చిన్నచూపు, చీదరింపు, అగౌరవం లాంటివి ఎదుర్కొంటున్నారు. వీరికి అందవలసిన గుర్తింపు, గౌరవం, మానవ హక్కులు, ఉద్యోగ ఉపాధులు, నాయకత్వ అవకాశాలు అందడం లేదు. దివ్యాంగుల సమస్యలను అధ్యయనం చేసిన ఐరాస- డబ్ల్యూహెచ్ఓ సూచన మేరకు ప్రతి ఏట డిసెంబర్ 3న ప్రపంచ దేశాలు ‘అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం’ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ ప్రత్యేక దినం ఈ ఏడాది ఇతివృత్తంగా ‘సమ్మిళిత సుస్థిర భవితకు దివ్యాంగులకు నాయకత్వ బాధ్యతలు అప్పగిద్దాం’ అనే అంశాన్ని ప్రకటించారు.
సామాన్య జనానికి సమానంగా దివ్యాంగులకు వైద్య ఆరోగ్య సంరక్షణ చర్యలు వేగం పుంజుకోవాల్సి ఉంది. ఈ దిశగా ఐరాస పలు సూచనలు, సలహా సహాయాలను అందించడానికి ముందుకు రావడం హర్షదాయకం. వికలాంగులను గౌరవించడం, వారికి విద్య అందించడం, సాధికారతను శక్తివంతం చేయడం, మానవ హక్కులను పరిరక్షించడం, దివ్యాంగ విజేతలను సన్మానించడం లాంటివి ఈ సందర్భంగా చర్చలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దివ్యాంగుల్లో 56 శాతం మహిళలు, 44 శాతం పురుషులు ఉన్నారు. దివ్యాంగుల్లో 69 శాతం వరకు గ్రామీణ జనాభా మాత్రమే ఉండడం మరో గమనించదగ్గ విషయం.
ఇరవై ఒక్క రకాల వైకల్యాలు
భారత్లో దాదాపు 8 శాతం జనాభా వికాంగులుగా నమోదయ్యారు. దివ్యాంగుల్లో 21 రకాల వైకల్యాలు కనిపిస్తాయి. వీటిలో ముఖ్యమైనవిగా దృష్టిదోషం, వినికిడి లోపం, మాట్లాడలేక పోవడం, నడక లోపం (లిప్రసీ చికిత్స పొందిన వారు, సెరిబ్రల్ పాల్సీ, మరుగుజ్జు, కండరాల లోపాలవారు, ఆసిడ్ దాడి బాధితులు), మానసిక వైకల్యం, బహు అంగవైకల్యం, రక్త రుగ్మతలు (హిమోఫిలియా, తలసేమియా, సికిల్ సెల్ రుగ్మత), నరాల బలహీనత (మల్టిపుల్ స్లిరోసిస్, పార్కిన్సన్ వ్యాధి), ఇతర వైకల్యాలు వస్తాయి. దివ్యాంగుల్లో 20 శాతం నడక లోపం, 18.9 శాతం వినికిడి లోపం, 18.8 శాతం దృష్టి దోషం, 5.6 శాతం మానసిక వైకల్యం కలిగిన వారు ఉన్నారు.
వైకల్యాన్ని జయించి విజేతలుగా నిలిచిన భారతీయ ప్రముఖుల్లో శాస్త్రీయ నాట్యకారిణి సుధా చంద్రన్ (నడక లోపం), సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ (దృష్టి దోషం), టివీ నిర్వాహకులు రామకృష్ణన్, బ్యాడ్మింటన్ ఆటగాడు గిరీష్ శర్మ, క్రికెటర్ ప్రీతి శ్రీనివాసన్, డాక్టర్ సత్యేంద్ర జైన్, టెన్నీస్ క్రీడాకారుడు ప్రభు, స్కైడైవర్ విశ్వనాథన్, పర్వతారోహకురాలు అరుణ సిన్హా (వీరంతా నడక లోపం గలవారు) వంటి పెద్దలు ఉన్నారు.
వికలాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయాలు, ఉత్తమ జీవన సౌకర్యాలు అందించడం, అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వడం, ఉచిత విద్య, సామాజిక భద్రత, డిజిటల్ వనరుల అందుబాటు, సమాచార కల్పన, ఉచిత వైద్యం, దివ్యాంగుల హక్కుల సంరక్షణ, ఉచిత న్యాయ సేవలు, ఉద్యోగాల్లో తగిన రిజర్వేషన్లు లాంటి చేయూతలను ఇవ్వడం ప్రభుత్వ పౌర సమాజ కనీస బాధ్యతగా తెలుసుకోవాలి. దివ్యాంగుల్లో ఆనందాల వెలుగులు చూడాలి. వికలాంగుల సేవలు దేశాభివృద్ధికి తోడ్పడాలి. దివ్యాంగుల్లో దైవత్వాన్ని దర్శించాలి. మేం ఉన్నామనే భరోసాను ఇవ్వాలి. వికలాంగులలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేయాలి. వారి సామర్థ్యాలనుబట్టి తగు అవకాశాలను కల్పించాలి.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి