calender_icon.png 30 May, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇళయరాజా స్టూడియోలో గర్భగుడి ఉన్నట్టు అనిపించింది.!

29-05-2025 08:31:16 PM

ఇళయరాజా(Ilaiyaraaja) ఓ సినిమాను ఒప్పుకుని సంగీతాన్ని అందించడమే ఓ గొప్ప విషయం. అలాంటిది ఆయన ప్రస్తుతం ‘షష్టిపూర్తి’ సినిమాకు పనిచేశారు. ఇక తన సంగీతంతో సినిమా స్థాయిని పెంచిన ఇళయరాజా ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఇళయరాజా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్షసింగ్ ప్రధాన పాత్రలుగా రూపేశ్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్‌ప్రభ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. ఈ క్రమంలోనే లిరిసిస్ట్ చైతన్యప్రసాద్ ఇళయరాజాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఇళయరాజా, చైతన్యప్రసాద్, దర్శకుడు పవన్‌ప్రభ, నిర్మాత రూపేశ్ ఏం చెప్పారంటే..

చైతన్యప్రసాద్: ఇన్నేళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో వేల పాటలు అందించారు.. పైగా సింఫనీ కూడా చేశారు? సింఫనీ అంటే ఏంటి? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది?

ఇళయరాజా: సింఫనీ అంటే ఏంటి? అనేది ఎవ్వరూ చెప్పలేరు.. సింఫనీ అనేది ఓ అనుభూతి. దాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేస్తేనే తెలుస్తుంది. త్వరలోనే నేను చేసిన ఆ ప్రయోగం వస్తుంది. అప్పుడు వినండి.. ఆస్వాదించండి.. అనుభూతి చెందండి. ఓ సినిమాకు సంగీతం చేయమని మాత్రమే దర్శక, నిర్మాతల నా వద్దకు వస్తుంటారు. నా పాండిత్యాన్ని వినియోగించి ఓ సింఫనీ చేయమని అడగరు. అందుకు నాకు నేనుగా, నాకోసం అన్నట్టుగా ఈ సింఫనీ చేస్తున్నాను.

చైతన్యప్రసాద్: ఎక్కడో కుగ్రామం నుంచి వచ్చారు.. ఇంతటి స్థాయికి ఎదిగారు.. మీ ప్రయాణం, యాత్ర గురించి చెప్పండి?

ఇళయరాజా: నేను ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టాను. ఆ కుగ్రామంలో సంగీతాన్ని నేర్పించేవారు కూడా ఉండరు. అలాంటి చోట నుంచి ఈ స్థాయికి వచ్చాను. మీరు నా ప్రయాణాన్ని యాత్ర అన్నారు. యాత్ర అంటే ప్రారంభ స్థలం ఉండాలి.. ఓ దారి ఉండాలి.. ఓ గమ్యస్థానం ఉండాలి. కానీ నాకు ప్రారంభం లేదు.. గమ్యస్థానం లేదు. అందుకని మీరు యాత్ర అని చెప్పొద్దు.

చైతన్యప్రసాద్: మీ మ్యూజిక్ మీద ఎలా ఇంట్రెస్ట్ ఏర్పడింది? మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారు?

ఇళయరాజా: చిన్నప్పుడు మా అన్న పాటలు పాడుతుండేవారు. అలా ఆ పాటలు వింటూ నాకు కూడా పాటల మీద మక్కువ ఏర్పడింది. మా అన్న పాటలు వింటూ నేను ఏదో ఒకటి వాయిస్తూ ఉండేవాడిని. ఈ ప్రపంచంలో నాలాంటి వాళ్లు ఎవ్వరూ ఉండరు. గతంలోనూ లేరు.. భవిష్యత్తులోనే రారు. ఎందుకంటే నేను ఎవ్వరి దగ్గర సంగీతాన్ని నేర్చుకోలేదు. నాకు సంగీతంలో ఓనమాలు కూడా తెలియవు. కానీ ఈ ప్రపంచంలో ఏ ఫేమస్ మ్యూజిషీయన్‌ను అయినా తీసుకోండి.. వారు సంగీతాన్ని నేర్చుకుని ఉంటారు.. లేదా ఎవరి వద్దయినా శిష్యరికం చేసి ఉంటారు. కానీ నేను మాత్రం ఎవ్వరి దగ్గర సంగీతాన్ని నేర్చుకోలేదు. నాకు ఆ దేవుడు ఈ వరాన్నిచ్చినట్టు అనిపిస్తుంది. అసలు నాకు సంగీతం ఎలా వచ్చింది? నా నుంచి పాటలు ఎలా ఉద్భవిస్తాయో నాకు కూడా తెలియదు.

చైతన్యప్రసాద్: మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, పాటల్ని కంపోజ్ చేయాలని ఎప్పుడు అనిపించింది?

ఇళయరాజా: మా అన్న పాటలు పాడుతుంటే వాటికి మధ్యలో మ్యూజిక్ వాయించేవాడిని. అప్పుడు అందరూ చప్పట్లు కొడుతుండేవారు. ఆ చప్పట్లు వింటుంటే నాకు అలా గర్వం పెరుగుతూ వచ్చేది. అయితే వాళ్లు చప్పట్లు కొట్టేది నేను వాయించినందుకా? ఆ సంగీతానికా? అని అనుకునేవాడిని. కచ్చితంగా సంగీతానికి చప్పట్లు కొడుతున్నారు. అంటే అది కంపోజ్ చేసిన ఎంఎస్‌వీ కోసం చప్పట్లు కొడుతున్నారని అర్థమైంది. మనకు కూడా ఈ చప్పట్లు కావాలంటే.. మనం కూడా మ్యూజిక్ కంపోజ్ చేయాలని అలా కంపోజింగ్ మీద దృష్టి సారించాను.

చైతన్యప్రసాద్: ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను ఎలా ఫాలో అవుతుంటారు?.. ఇక ఏఐ కూడా మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తుందని అంటున్నారు?

ఇళయరాజా: అసలు ఈ ట్రెండ్ అనే మాటే నాకు అర్థం కాదు. పాట బాగుంటే ఎప్పుడైనా వింటారు. మనం చేసే పాట జనానికి నచ్చాలి అంతే! అందులో ట్రెండ్ అనేది ఏం ఉంది. ఏఐ అనేది స్వతహాగా ఏమీ చేయలేదు. మనిషి మెదడు లక్ష ఏఐలతో సమానం. ఏఐ ఏం చేసినా కూడా అందులో జీవం ఉండదు. ముందే మనం ఫీడ్ చేసిన ఇన్‌స్ట్రక్షన్స్‌తో ఏఐ పని చేస్తుందంతే! మనిషి ఏఐని కనిపెట్టాడు.. కానీ ఓ ఏఐ మనిషిని గాని, మానవ మెదడుని గానీ సృష్టించలేదు.

చైతన్యప్రసాద్: మీలాంటి వారు ఇలాంటి కొత్త టీం కోసం ముందుకు వచ్చారు. ‘షష్టిపూర్తి’లో మీకు నచ్చిన అంశం ఏంటి?

ఇళయరాజా: నా కెరీర్ ఆరంభం నుంచి కూడా కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. భారతీరాజా, మణిరత్నం ఇలా అందరూ అప్పట్లో కొత్త వాళ్లే. నాతో సినిమాలు చేసిన తర్వాత వారికి ఆ స్టార్‌డమ్, గుర్తింపు వచ్చింది. వాళ్లను వాళ్లు నిరూపించుకుని ఆ స్థాయికి వెళ్లారు. అలా కొత్తగా వచ్చేవారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ‘షష్టిపూర్తి’ని ఒప్పుకున్నాను. ఇందులో మేం చేసిన పని ఎలా ఉంది? అనేది ప్రేక్షకులే చెప్పాలి. మంచి కథ ఉందా? లేదా? అన్నదే నేను చూస్తాను. స్టార్స్ ఉన్నారా? లేదా? అన్నది నేను పట్టించుకోను.

చైతన్యప్రసాద్: మీరు ఎప్పుడూ ఇళయరాజా పాటలే వింటుంటారు. అసలు మీ తొలి ప్రాజెక్ట్‌కు ఆయనతోనే చేస్తాను అని ఎలా అనుకున్నారు?

పవన్‌ప్రభ: నేను 80వ దశకంలో పుట్టాను. నాకు ఇళయరాజా పాటలే ప్రపంచం. నాకు అవి పాటలు కాదు.. కీర్తనలు. నేను దేవుడికి దండం పెట్టడం అయినా మర్చిపోతాను కానీ ఇళయరాజా పాటలు వినడం మాత్రం మర్చిపోను. నేను ఇళయరాజాతోనే చేయాలని గుడ్డిగా ఫిక్స్ అయ్యాను. ముందు ఆయన్నే అడుగుదాం. ఆయన కుదరదు అంటే చూద్దాంలే అని అనుకునేవాడ్ని. కానీ నా ఈ కలను మా నిర్మాత రూపేశ్ నిజం చేశారు. ఇదే కథను చాలా వద్దకు తీసుకెళ్లి వినిపించాను. కానీ రాజా నీ కోసం ఎందుకు వస్తారు? అని అంతా అడిగేవారు. కానీ రూపేశ్ మాత్రం ప్రయత్నిద్దామని అన్నారు. నేను రాజాకు రెండు నిమిషాలు కూడా కథ చెప్పలేదు. ఆయన వెంటనే ఓకే అన్నారు. అసలు నేను చెప్పిందాంట్లో ఆయనకు ఏం అర్థమైందో ఆ దేవుడికే తెలియాలి. ఈ భూమ్మీద ఉన్న దర్శకుల్లోనే నేనే చాలా లక్కీ పర్సన్ అని అనిపిస్తుంటుంది. ‘షష్టిపూర్తి’ చిత్రం ఎప్పటికీ అలా నిలిచిపోతుంది. ఈ చిత్రంలో ఎంతో అద్భుతమైన మ్యూజిక్ ఉంది. ఈ చిత్రానికి రాజానే హీరో. ఇదొక మ్యూజికల్ ఫిల్మ్. ఈ మూవీలో ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయి. రాజాతో పనిచేసిన ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. 

చైతన్య ప్రసాద్: రాజాతో పనిచేసిన అనుభవం మీ మాటల్లో చెప్పండి?

హీరో, నిర్మాత రూపేశ్: రాజా వద్దకు వెళ్తున్నామంటేనే చాలా భయంగా అనిపించింది. మా లాంటి కొత్త వారిని కూడా ఎంతో గొప్పగా ప్రేమించి సపోర్ట్ చేశారు. ఆయనతో పనిచేయడం మా అదృష్టం. మా ఈ ‘షష్టిపూర్తి’ జర్నీని ఎప్పటికీ మర్చిపోలేను.

చైతన్యప్రసాద్: ‘షష్టిపూర్తి’ కూడా రాజా స్టూడియోలోనే ప్రారంభమైంది కదా?

పవన్‌ప్రభ: నాకు రాజా స్టూడియో అంటే గుడి. అలాంటప్పుడు గుడిలోనే కదా నా సినిమాను ప్రారంభించాలి. నా సినిమాకు మ్యూజిక్ ఇస్తానని రాజా వరం ఇచ్చారు.

చైతన్యప్రసాద్: రాజా బాణీకి కీరవాణితో పాట రాయించారు.. ఆ అనుభవం గురించి చెప్పండి?

పవన్‌ప్రభ: ‘షష్టిపూర్తి’ చిత్రంలో ఓ క్లిష్టమైన సందర్భం ఉంటుంది. ఒకే సారి మంచి చెప్పాలి.. చెడు గురించి చెప్పాలి. అలాంటి ఓ సందర్భానికి కీరవాణి పాట రాస్తే బాగుంటుందని నాకు అనిపించింది. రాజా ఇచ్చిన బాణీని, ఆ స్థాయికి తగ్గట్టుగా రాయడం కీరవాణి వల్ల సాధ్యం అవుతుందని నేను అనుకున్నాను. కీరవాణి రాసిన పాటల్లో ‘కన్నా నిదురించరా’ అనే పాట నాకు చాలా ఇష్టం. నేను ఈ ‘షష్టిపూర్తి’ సినిమాలోని ప్రతీ రీల్‌ను రాజాతోనే చూశాను. ఆ అదృష్టం నాకే దక్కినట్టుంది. 

చైతన్యప్రసాద్: మీరు ఒకే ట్యూన్ ఇస్తారని.. మీరు చాలా నిరంకుశంగా ఉంటారనే ప్రచారం జరుగుతుంటుంది. కానీ మాకు మాత్రం ఎప్పుడూ అలా అనిపించలేదు? ఆ ప్రచారం ఎందుకు వచ్చింది?

ఇళయరాజా: ‘దళపతి’ టైమ్‌లో మణిరత్నంకి ‘సుందరి నేనే నువ్వంటా’ అనే పాటకి ట్యూన్ ఇచ్చాను. మణిరత్నం ఏమనుకున్నాడో ఏమో గానీ.. ఇంకో ట్యూన్ ట్రై చేద్దామా? అని అడిగాడు. మణి ఈ ట్యూన్‌ను మాత్రం అస్సలు మిస్ అవ్వకు అని చెప్పాను. అంతే అంటారా? అని మణిరత్నం అన్నారు. అంతే అని నేనూ అన్నాను. అలా ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు. ఒకే ట్యూన్ ఇస్తాడని ప్రచారం జరిగి ఉండొచ్చు. కానీ ఓ గొప్ప ట్యూన్, కలకాలం నిలిచే పాట మిస్ అవ్వొద్దని అలా చెబుతుంటాను.  

చైతన్యప్రసాద్: ఒకే సారి మీరు పదుల చిత్రాలకు పని చేస్తుండేవారు? ఆ ఒత్తిడిని ఎలా భరించేవారు?

ఇళయరాజా : దీపావళి సీజన్ వస్తుందంటే డజన్ చిత్రాలు రిలీజ్ అవుతుండేవి. ఆ డజన్ చిత్రాలకి కూడా నేనే మ్యూజిక్ ఇస్తుండేవాడ్ని. ఇక రీ రికార్డింగ్, బీజీఎం పనులన్నీ కూడా మూడు రోజుల్లోనే పూర్తి చేసేవాడ్ని. అలా ఒకసారి మూడు చిత్రాలను పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకోసం మూడు స్టూడియోల్ని బుక్ చేశాను. మూడు టీంలను పెట్టుకుని ప్రాక్టీస్ చేయించాను. మూడు డిఫరెంట్ జానర్ చిత్రాలను.. మూడు రోజుల్లోనే ఫినిష్ చేశాను. ఇప్పటికీ ఆ మూడు సినిమాలు చూస్తే ఒక దాంట్లోని మ్యూజిక్ ఇంకో దాంట్లో కనిపించదు.

పవన్‌ప్రభ: మీరు మొదటి సారిగా రాజా గారి సంగీతాన్ని పాటను రచించారు కదా? ఆ అనుభూతిని చెప్పండి?

చైతన్యప్రసాద్: నేను లిరిసిస్ట్‌గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచీ రాజాకి పాట రాయాలని అనుకుంటూ ఉండేవాడిని. కానీ మీరు కథ చెప్పడానికి వచ్చినప్పుడు.. రాజా సంగీతసారథ్యం అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. అలా నా వద్దకు చాలా మంది చెప్పారు కానీ అవేవీ జరగలేదు. మీరు టికెట్ వేసి చెన్నైకి తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టినప్పుడు నమ్మాను. రాజా స్టూడియోలోకి వెళ్తుంటే గర్భ గుడిలోకి వెళ్లినట్టు అనిపించింది. రాజాకి చరణ్, యువన్ మొదటిసారిగా పాటలు పాడారు. ‘షష్టిపూర్తి’ టీమ్ నాకు ఇచ్చిన వరం ఇది.