calender_icon.png 31 May, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ ఏం చేసినా జీవం ఉండదు!

30-05-2025 12:00:00 AM

రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్షసింగ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. మీరో రూపేశ్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్‌ప్రభ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. ఈ క్రమంలోనే గీత రచయిత చైతన్యప్రసాద్.. ఈ సినిమాకు సంగీత సారథ్యం వహించిన ఇళయరాజాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివీ.. 

చైతన్యప్రసాద్: ఇన్నేళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో వేల పాటలు అందించారు.. పైగా సింఫనీ కూడా చేశారు? సింఫనీ అంటే ఏంటి? 

ఇళయరాజా: సింఫనీ అంటే ఏంటో ఎవ్వరూ చెప్పలేరు. సింఫనీ.. ఓ అనుభూతి. ఎక్స్‌పీరియెన్స్ చేస్తేనే తెలుస్తుంది. త్వరలోనే నేను చేసిన ఆ ప్రయోగం వస్తుంది. అప్పుడు అనుభూతి చెందండి. ఓ సినిమాకు సంగీతం చేయమని మాత్రమే దర్శక, నిర్మాతల నా వద్దకు వస్తుంటారు. నా పాండిత్యాన్ని వినియోగించి ఓ సింఫనీ చేయమని అడగరు. అందుకే నాకు నేనుగా, నాకోసం అన్నట్టు ఈ సింఫనీ చేస్తున్నా.

చైతన్యప్రసాద్: మీ యాత్ర గురించి..

ఇళయరాజా: నేను ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టాను. ఆ కుగ్రామంలో సంగీతాన్ని నేర్పించేవారు కూడా ఉండరు. అలాంటి చోట నుంచి ఈ స్థాయికి వచ్చాను. మీరు నా ప్రయాణాన్ని యాత్ర అన్నారు. యాత్ర అంటే ప్రారంభ స్థలం ఉండాలి.. ఓ దారి, గమ్యస్థానం ఉండాలి. కానీ నాకు ప్రారంభం లేదు.. గమ్యస్థానం లేదు. అందుకని మీరు యాత్ర అని చెప్పొద్దు.

చైతన్యప్రసాద్: మీ మ్యూజిక్ మీద ఎలా ఇంట్రెస్ట్ ఏర్పడింది? మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారు?

ఇళయరాజా: చిన్నప్పుడు మా అన్న పాటలు పాడుతుండేవారు. అలా ఆ పాటలు వింటూ నేను ఏదో ఒకటి వాయిస్తూ ఉండేవాడిని. ఈ ప్రపంచంలో నాలాంటి వాళ్లు ఎవ్వరూ ఉండరు. గతంలోనూ లేరు.. భవిష్యత్తులోనే రారు. ఎందుకంటే నేను ఎవ్వరి దగ్గర సంగీతాన్ని నేర్చుకోలేదు.

నాకు సంగీతంలో ఓనమాలు కూడా తెలియవు. కానీ ఈ ప్రపంచంలో ఏ ఫేమస్ మ్యూజిషీయన్‌ను అయినా తీసుకోండి.. వారు సంగీతాన్ని నేర్చుకుని ఉంటారు.. లేదా ఎవరి వద్దయినా శిష్యరికం చేసి ఉంటారు. కానీ నేను మాత్రం ఎవ్వరి దగ్గర సంగీతాన్ని నేర్చుకోలేదు. నాకు ఆ దేవుడు ఈ వరాన్నిచ్చినట్టు అనిపిస్తుంది. అసలు నాకు సంగీతం ఎలా వచ్చింది? నా నుంచి పాటలు ఎలా ఉద్భవిస్తాయో నాకు కూడా తెలియదు.

చైతన్యప్రసాద్: మీరు ఒకే ట్యూన్ ఇస్తారనీ.. చాలా నిరంకుశంగా ఉంటారనే టాక్?

ఇళయరాజా: ‘దళపతి’ టైమ్‌లో మణిరత్నంకి ‘సుందరి నేనే నువ్వంటా’ అనే పాటకు ట్యూన్ ఇచ్చాను. మణిరత్నం ఏమనుకున్నాడో ఏమో గానీ.. ఇంకో ట్యూన్ ట్రై చేద్దామా? అని అడిగాడు. మణి ఈ ట్యూన్‌ను మాత్రం అస్సలు మిస్ అవ్వకు అని చెప్పాను.

అంతే అంటారా? అని మణిరత్నం అన్నారు. అంతే అని నేనూ అన్నాను. అలా ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు. ఒకే ట్యూన్ ఇస్తాడని ప్రచారం జరిగి ఉండొచ్చు. కానీ ఓ గొప్ప ట్యూన్, కలకాలం నిలిచే పాట మిస్ అవ్వొద్దని అలా చెబుతుంటాను.