11-06-2025 01:28:06 AM
- కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జీ
- ఐఐటీ హైదరాబాద్లో యువ శాస్త్రవేత్తల అంతర్జాతీయ సమ్మేళం
సంగారెడ్డి, జూన్ 10(విజయక్రాంతి): ప్రపంచ జ్ఞాన ఉద్యమంలో భారతదేశం ముందంజలో ఉందని, అంతేగాకుండా జీ-20లో భారతదేశం వసుదైవ కుటుంబంను ప్రతిబింబించిందని కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జీ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న యువ శాస్త్రవేత్తల అంతర్జాతీయ సమావేశం - దార్శనికుల సంగమం, ప్రపంచ మార్పు కోసం శాస్త్రాన్ని సాధికారపరచడం అనే అంశాలపై సమ్మేళనం నిర్వహిస్తోంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, గ్లోబల్ యంగ్ అకాడమీ, ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ సహకారంతో జూన్ 8 నుండి 14 వరకు భారతదేశంలో మొదటిసారిగా జరుగుతున్న వారం రోజుల కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రపంచ సవాళ్లకు సైన్స్ ఆధారిత పరిష్కారాలపై సహకరించడానికి తదుపరి తరం ప్రపంచ శాస్త్రీయ నాయకులను ఒకచోట చేర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
ఈ కార్యక్రమాన్ని సోమవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జీ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశం పురాతన జ్ఞాన సృష్టి సంప్రదాయాన్ని ఉత్సుకత, స్థిరత్వం, నైతికతలో పాతుకుపోయిందని చెప్పారు. పురాతన తత్వవేత్తల సహకారాన్ని, అంతరిక్ష మిషన్లు, ఆహార భద్రత, ఆటోమేషన్, రోబోటిక్స్, బిగ్ డేటాలో మైలురాళ్ల ద్వారా దేశం సాధించిన అద్భుతమైన పురోగతిని మంత్రి వివరించారు. డిజిటల్ డొమైన్లో సమ్మిళితత్వం ప్రాముఖ్యతను వెల్లడించారు.
అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఏఎన్ఆర్ఎఫ్ వంటి కార్యక్రమాలు అట్టడుగు స్థాయి ఆవిష్కరణలను పెంపొందించడానికి, అధిక-నాణ్యత గల ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం నిబద్ధతను ప్రతిబింబిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో 60 దేశాలకు చెందిన 135 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 65 మంది జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు. దీని ద్వారా నిజంగా వైవిధ్యభరితమైన సమగ్రమైన వేదిక ఏర్పడుతుంది. ప్రపంచ శాస్త్రీయ సమాజంలో అభివృద్ధి చెందుతున్న నాయకుల మధ్య లోతైన సంభాషణకు దోహదపడే గ్లోబల్ యంగ్ అకాడమీ వార్షిక సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించనున్నారు.