18-06-2025 08:16:12 PM
పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు..
హనుమకొండ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు(PDSU State Vice President B. Narasimha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ డీఈఓ కార్యాలయం ముందు ధర్నా చేసి, సూపర్డెంట్ జ్యోతి, హన్మకొండ డిఇఓ కార్యాలయం సూపరిండెంట్ ప్రసాద్ లకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది.
విద్యార్థులందరికీ పాఠ్య, నోట్ పుస్తకాలు అందించాలని, పెరిగిన ధరల కనుగుణంగా మధ్యాహ్న భోజనానికి నిధులను పెంచాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని, పర్మిషన్ లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలను మూసివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర నాయకులు కావ్య, పి.అనూష, జిల్లా నాయకులు వంశీ, చారి, శ్రీజ, సాధన తదితరులు పాల్గొన్నారు.