ధాన్యం కొనుగోళు కేంద్రాల తనిఖీ
మహబూబాబాద్, మే 20 (విజయక్రాంతి): మహబూబాబాద్.జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ జిల్లాలోని సిరోలు మండలం మన్నెగూడెం, మరిపెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (ఫ్యాక్స్) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రాలకు ఇప్పటివరకు వచ్చిన ధాన్యం వివరాలు, ప్రస్తుతం నిల్వ ఉన్న వివరాలు, మిల్లులు, గోదాములకు పంపిన ధాన్యం వివరాల ఇన్వార్డ్, అవుట్ వార్డు రిజిస్టర్ ను, ట్యాబ్ ఎంట్రీ, వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల లో ప్రత్యేక అధికారులు, తహసీల్దారులను నియమించడం జరిగిందని, వారి పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు ఒక కేంద్రానికి నిబద్ధత కలిగిన అధికారిని నియమించి ప్రతినిత్యం కొనుగోలు రవాణా విషయాలలో వేగంగా పనిచేస్తూ లక్ష్యాలను చేరుకునే దిశగా ఉన్నారని అదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. రైతులకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని, కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉండాలని, గన్నీ సంచులు, టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని,
లోడింగ్ అన్లోడింగ్ లో వేగం పెంచాలని, సాధ్యమైనంత త్వరగా స్థానిక వాహనాలను హమాలీలను సమకూర్చుకొని ధాన్యాన్ని తరలించాలన్నారు..జిల్లాలో సరిపడంతా నిల్వ ప్రదేశాలు మిల్లులు, గోదాములలో ఉందని లారీ కాంట్రాక్టర్స్ ఆ దిశగా తరలించాలని సూచించారు. కలెక్టర్ వెంట డిఆర్డిఓ ప్రాజెక్ట్ అధికారి మధుసూదన రాజు, జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారిని సరిత, పౌరసరఫరాల శాఖ అధికారి రమేష్, డిస్టిక్ మేనేజర్ నరసింహారావు, సిరోలు, మరిపెడ మండలాల తహసిల్దార్లు కృష్ణవేణి, పున్నం చందర్ తదితరులు ఉన్నారు.






