05-06-2025 04:23:03 PM
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు..
మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్..
దండేపల్లి (విజయక్రాంతి): దండేపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ సిబ్బంది గురువారం ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలోని విత్తనాలు, వాటి లేబుల్లను పరిశీలించారు. దుకాణంలో ఉన్న స్టాకు వివరాలను, రిజిస్టర్లో నమోదు చేసిన స్టాక్ వివరాలతో పోల్చి చూశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి అంజిత్ కుమార్(Mandal Agriculture Department Officer Anjit Kumar), పట్టణ ఎస్ఐ తైసినోద్దీన్ లు మాట్లాడుతూ... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని పలు విత్తనాల దుకాణాలను తనిఖీ చేశామన్నారు.
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దని, నకిలీ పత్తి విత్తనాల బారినపడి మోసపోవద్దన్నారు. ప్రతి విత్తన షాపులో నాణ్యమైన విత్తనాలు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా షాపు యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్మినా, అటువంటి విత్తనాలు పెట్టినా, ఆ విత్తనాల సరఫరా చేసినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.