పెద్దకొత్తపల్లి గ్రామ హహిళ సర్పంచ్కు ఘోర అవమానం.!
- మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి పిలిచి మాజీ ఎంపీటీసీ చేత ప్రారంభం.
- పీఏసీఎస్ అధికారుల అత్యుత్సాహం
- అధికారులపై సర్పంచ్ రేణుక ఫిర్యాదు
నాగర్కర్నూల్,(విజయక్రాంతి): పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో గ్రామ మహిళా సర్పంచ్ కు ఘోర అవమానం జరిగింది. గురువారం సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రావాలని సీఈవో సిరాజుద్దీన్ ఆహ్వానించి, అనంతరం మాజీ ఎంపీటీసీ దండు నరసింహ చేత ప్రారంభం చేయించడంతో సర్పంచ్కు అవమానం జరిగిందని పెద్దకొత్తపల్లి గ్రామ సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై బాధ్యులైన పీఏసీఎస్ సీఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల ప్రత్యేక అధికారి రాజేశ్వరి, ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. ఇకముందు గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్లను గౌరవపూర్వకంగా ఆహ్వానించి నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తనను అవమానపరిచిన వారిపై ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు ఆదేశాలు రాకముందే సొంతంగా తామే మార్కెట్ కమిటీ చైర్మన్ లంటూ చెప్పుకొని తిరుగుతూ హంగామా సృష్టిస్తున్న వారికి సహకరించడమేంటని చర్చ జరుగుతుంది.






