calender_icon.png 29 June, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లొద్దు

29-06-2025 02:35:26 AM

  1. ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి

డాటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ప్రతిపాదిక ప్రాజెక్టుపై 15 రోజులకోసారి సబ్ కమిటీ చర్చించాలి

పరిశ్రమల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేందుకు ముందు కు వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరూ వెనక్కి వెళ్లడానికి వీల్లేదని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ భూ సేక రణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డాటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, డాటా సెంటర్ల కోసం కావాల్సిన స్థలం సిద్ధం చేయాలని చెప్పారు. పరిశ్రమలశాఖపై శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నిమ్జ్‌లో మిగిలి ఉన్న భూసేకరణను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడి భూము లు ఇవ్వడానికి ఒప్పించాలని సూచించారు. ఫ్యూచర్‌సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లె క్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఆర్కిటెక్చర్స్‌ను నియమించుకోవాలని తెలిపారు. 

మెగా ప్రాజెక్ట్స్‌పైన మంత్రివర్గ ఉప సంఘం ప్రతి 15 రోజులకోసారి సమావేశం నిర్వహించి ప్రతిపాదిత ప్రాజెక్టులపై చర్చించాలని సూచించారు. 2024-లో ౭౦ గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు రాగా, 2025లో ఇప్పటికే 25 గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు వచ్చా యని, మరిన్ని సెంటర్లు వచ్చేలా కృషి చేయాలని కోరారు. 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకుని అధికారులు పనిచేయాలని ఆదేశించారు. సమీక్షలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి, టీజీఐసీసీ వైస్ చైర్మన్ శశాంక పాల్గొన్నారు.