05-12-2025 01:08:24 AM
క్రికెట్లో అన్ని విభాగాల్లోనూ రాణిస్తేనే విజయం అందుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఈ మూడింటిలోనూ సమిష్టిగా పైచేయి సాధిస్తే గెలుపు సొంతమవుతుంది. ఒక్కదానిలో ఫెయిలయినా ఫలితం తారుమారవుతుంది. ప్రస్తుతం భారత వన్డే జట్టు బ్యాటింగ్లో హిట్టు.. బౌలింగ్లో ఫట్టు అన్న రీతిలో సాగుతోంది. బుమ్రా లేకుంటే మన బౌలింగ్ బలం ఇంతేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాయ్పూర్, డిసెంబర్ 4 : సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ భారత బలహీనతలను స్పష్టంగా ఎత్తిచూపుతోంది. ప్రతీసారీ బ్యాటర్లే మ్యాచ్లు గెలిపిం చలేరన్న మాట నిజమవుతోంది. తొలి వన్డేలో అతికష్టంతో గట్టెక్కిన టీమిండియా రెండో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. ముఖ్యంగా మన బౌలర్లు అట్ట ర్ ఫ్లాప్ అయ్యారు. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా అందరూ చేతులెత్తేశారు. అర్షదీప్ సింగ్(2/54) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు.
హర్షిత్ రాణా 10 ఓవర్లలో స్పెల్లో 1 వికెట్ తీసి 70 రన్స్ ఇచ్చాడు. అలాగే కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లకు 78 రన్స్ ఇచ్చుకున్నాడు. ఇక ప్రసిద్ధ కృష్ణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2 వికెట్లు తీసినప్పటకీ 8.2 ఓవర్లలో ఏకంగా 85 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి వన్డేలో కూడా 7.2 ఓవర్లు వేసి 48 రన్స్ ఇచ్చేశాడు. ఇక సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం ప్రభావం చూపించలేకపోతున్నాడు.
రాంఛీ వన్డేలో వికెట్ తీయకపోగా 9 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు రాయ్పూర్ వన్డేలోనూ వికెట్ తీయలేదు. ఇలాంటి బౌలింగ్తో విజయాలు ఆశించడం అత్యాశే అవుతుందని పలువురు మాజీలు తేల్చేస్తున్నారు. మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అయితే మన బౌలర్లపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఇలాంటి బౌలింగ్ ఉంటే 500 టార్గెట్ను అయినా కాపాడుకోలేపోమం టూ వ్యాఖ్యానించారు.
రాయ్పూర్లో మంచు ప్రభావం కూడా భారత్కు ప్రతికూలంగా మారిందన్న విషయాన్ని ఏకీభవిస్తూనే పూర్తిగా దానినే ఓటమికి సాకుగా చూపలేమన్నారు. ఇదిలా ఉంటే సిరీస్ డిసైడర్గా మారిన చివరి వన్డే విశా ఖ వేదికగా శనివారం జరగబోతోంది. టాస్ సంగతి పక్కన పెడితే బౌలింగ్ బాగుంటే ఛేజింగ్ పిచ్లపై సైతం ప్రత్యర్థిని కట్టడి చేయొచ్చన్నది ఎన్నోసార్లు రుజువైంది. అందుకే బౌలర్లు గాడిన పడితే తప్ప వన్డే సిరీస్లో భారత్ గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే విశాఖ పిచ్ కూడా ఛేజింగ్కే అనుకూలం. అలాంటప్పుడు టాస్ గెలవడం ఖచ్చితంగా కీలకం కాబోతోంది.
టాస్ ఎవరి చేతుల్లోనూ ఉండదు కాబట్టి బౌలర్లు మాత్రం ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. బౌలింగ్ కోచ్గా ఉన్న మోర్నే మోర్కెల్ బౌలర్లపై మరింత ఫోకస్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులకు అవకాశముంది. రెండో వన్డేలో పంత్ను తీసుకుంటారని అనుకున్నా అదేమీ జరగలేదు. అయితే చివరి వన్డేకు మాత్రం వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో పంత్ను తీసుకునే ఛాన్సుంది.
వాషింగ్టన్ సుందర్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్తోనూ ఆకట్టుకోలేకపోయాడు. అలాగే పేలవ బౌలింగ్తో నిరాశపరుస్తున్న ప్రసిద్ధ కృష్ణను తీసుకుంటారని భావిస్తున్నారు. అతని స్థానంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్రెడ్డికి చోటు దక్కుతుందేమో చూడాలి. నితీశ్ జట్టులోకి వస్తే బౌలింగ్ ఆప్షన్ ఉండడంతో పాటు బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. ఇక రుతురాజ్ గైక్వాడ్ రెండో వన్డేలో సెంచరీ చేయడంతో అత ని స్థానానికి డోకా లేదు. మొత్తం మీద సాగర తీరాన జరగబో యే సిరీస్ డిసైడర్లో ఎవరు చేయి సాధిస్తారో చూడాలి.