calender_icon.png 4 July, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

04-07-2025 12:00:00 AM

- 82 మంది పాలస్తీనీయుల మృతి.. వందల మందికి గాయాలు

- 58 వేలు దాటిన మృతుల సంఖ్య

-60 రోజుల కాల్పుల విరమణకు ట్రంప్ ప్రతిపాదన

గాజా సిటీ, జూలై 3: హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపుడుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) బుధవారం రాత్రి వరుస వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 82 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 38 మంది మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న వారే కాగా.. దాడుల్లో అనేక మంది గాయపడినట్టు పేర్కొంది. అక్టోబర్ 2023లో ప్రారంభమైన ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

హమాస్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన 1200 మందికి పైగా పౌరులు మరణించారు. దీంతో గాజా సిటీ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఇప్పటివరకు 58 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించగా.. పెద్ద సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు. గాజా అంశంలో తమ ప్రతినిధులు ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ చర్చలు చేపట్టారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.

గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, ఆ సమయంలో అన్ని పార్టీలతో కలిసి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామన్నారు. శాంతి ఒప్పందం కోసం ఖతార్, ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నించాయని వాళ్లే దీనికి సంబంధించిన తుది ప్రతిపాదన చేస్తారన్నారు. గాజాపై యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తామంటేనే ఒప్పందాన్ని అంగీకరిస్తామని హమాస్ సంస్థ తెలిపింది. మరోవైపు హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హమాస్ ఉండదు.. హమస్థాన్ ఉండదు. ఆ సంస్థను త్వరలో పూర్తిగా తుడిచిపెట్టేస్తాం’ అని తెలిపారు.