10 June, 2026 | 6:10 PM

అక్రిడిటేషన్ కార్డుల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

10-06-2026 05:35 PM

నిర్మల్ జూన్ 10 ( విజయ క్రాంతి):  జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని, ఈ కార్డుల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అక్రిడిటేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇది తీవ్రమైన అంశమని పేర్కొంటూ, ప్రభుత్వం ఉచితంగా జారీ చేసే అక్రిడిటేషన్ కార్డుల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అక్రిడిటేషన్ కార్డుల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే సంబంధిత జిల్లా పౌరసంబంధాల అధికారి (డీపీఆర్‌వో)కి లేదా నేరుగా తమకు సమాచారం అందించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందజేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.