29-06-2025 12:19:42 AM
భద్రాచలం,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ అంకంపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న వజ్జ రోజా పదవ తరగతి ఫలితాల్లో పాఠశాలల్లో రెండవ ర్యాంకు సాధించి పాఠశాలకు మంచి పేరు వచ్చేలా చేసినందుకు ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి .రాహుల్ అన్నారు. శనివారం తన ఛాంబర్ లో గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాల అంకంపాలెంలో గత సంవత్సరం10వ తరగతి పూర్తిచేసిన వజ్జ రోజా పదవ తరగతి ఫలితాలలో 9 వ గ్రేడ్ లో ఉత్తీర్ణురాలై, పాఠశాల స్థాయిలో రెండవ ర్యాంకు సాధించి తోటి విద్యార్థినిలకు ఆదర్శంగా నిలిచిందని, ప్రభుత్వ కార్పోరేట్ కళాశాల ఖమ్మంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివి బైపీసీలో 440 మార్కులకు గాను 424 సాధించడం జరిగిందని, ఆమె కోరిక డాక్టర్ కోర్స్ చదివి డాక్టర్ అయిన తర్వాత మారుమూల గిరిజన గ్రామాలలో పేద గిరిజన కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవలు చేయాలనే కుతూహలంతో ఇప్పటి నుండే నీట్ శిక్షణ తీసుకుంటుందని అందుకు ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని అన్నారు.