01-06-2025 12:26:02 AM
ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ విజ్ఞప్తి
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): అనంతగిరిలోని 9వ శతాబ్దానికి చెందిన పురాతన జైన గుహలను కాపాడుకోవాలని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, పురావస్తు పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో 9వ శతాబ్దానికి చెందిన 15 జైన గుహల సముదాయాలను శనివారం ఆయన సందర్శిం చారు.
చదరం, దీర్ఘచదరంగా ఉన్న గుహలు 2 నుంచి 6 మీటర్ల పొడవు, 2 నుంచి 3 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల ఎత్తును కలిగి, తూర్పు వైపు ద్వారంతో నేలపై రాతిపడకలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. వానాకాలంలో జైన మునులు ఈ గుహలలో నివసించేవారని, రాతిపడకలపై మరణించేంతవరకు ఆహారం తీసుకోకుండా సల్లేఖన వ్రతాన్ని ఆచరించేవారని తెలిపారు.
ఒక గుహలో పద్మాసనంలో ఉన్న జైన తీర్థంకరుడి విగ్రహం వల్ల ఈ గుహలు క్రీ.శ.9వ శతాబ్ది (రాష్ర్టకూటుల) కాలానికి చెందినవని తెలిపారు. చారిత్రక ప్రాధాన్యతగల 1100 సంవత్సరాల నాటి జైన గుహలను కాపాడాలని, ఆలయ, వికారాబాద్ పురపాలక సంఘ అధికారులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆలయ చైర్మన్ డాక్టర్ పద్మనాభం వాటిని కాపాడటానికి సహకారిస్తానన్నారు. వారసత్వ కార్యకర్తలు డీఆర్ శ్యాంసుందర్ రావు, బీ వెంకటరెడ్డి, బీ సాయి కిరణ్ రెడ్డి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.