టమాటా రైతులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలో టమాటా రైతు పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక సాగుదారులు దిగాలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో టమాటా సాగు చేసిన రైతు కుదేలయ్యాడు. మార్కెట్లకు తీసుకువచ్చిన, తర్వాత టమాటా ధర కిలో రూ.2 పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరైతే తాము పండించిన పంటను రోడ్లపై పారబోస్తున్నారు. మరికొందరు పశువులకు మేతగా వేస్తున్నారు.
రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో సుదూర ప్రాంతాలకు సరుకును తరలించలేక పోతున్నారు. కూలీల రేట్లు, టోల్ ఛార్జీలు భారంగా మారాయి. ఎంతో కష్టపడి సాగు చేస్తే వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారని రైతులు వాపోతున్నారు. రైతు నిర్ణయించాల్సిన ధరను వ్యాపారులు నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. దళారుల దోపిడీని అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. వ్యవసాయం జూదంగా మారిన తరుణంలో అధికారుల పర్యవేక్షణ పెరగాలి. రైతలకు గిట్టుబాటు ధర అందించాలి.
కేత్యా నాయక్, గూడూరు, మహబూబాబాద్ జిల్లా




