కార్తి మరో తెలుగు చిత్రం!

06-05-2024 12:05:00 AM

అనువాద  రూపేణా ఎందరు హీరోలు తెలుగులోకి వచ్చినా ‘తెలుగువాడే’ అన్నంతగా ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ కథానాయకుడు కార్తి. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘ఊపిరి’ చిత్రంతో నేరుగా తెలుగు చిత్రం చేసిన కార్తి తాజాగా మరో తెలుగు చిత్రానికి సై అన్నట్టు సమాచారం. ఈ మేరకు ఓ దర్శకుడు కార్తికి కథ వినిపించగా దానికి ఆయన సుముఖత తెలిపారట. ద్విభాషా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్  నిర్మించనున్నారట. స్క్రిప్ట్ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచన చేసే వ్యక్తి సురేశ్. ఆయన ఈ సినిమా నిర్మించనుండటం ఆసక్తికరమే. అయితే ప్రస్తుతం తన 26వ చిత్రం చేస్తున్న కార్తి, తర్వాత ‘సర్దార్ 2’ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నారు. అవి పూర్తయిన తర్వాతే ఈ ద్వి భాషా చిత్రం వచ్చే అవకాశముంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం కార్తి ‘వా వాతియారే’ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. నళన్ కుమారసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది.