కామెడీతో పాటు విలక్షణతలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం నాడు హైదరాబాద్లోని ఎఎఎ సినిమాస్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కథానాయకుడు తేజ సజ్జ ట్రైలర్ని విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ “మామూలుగానే కామెడీ చేయడం చాలా కష్టం.
సెట్లో రకరకాల పరిస్థితుల మధ్య చేయడం మరింత కష్టం. అర్థవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే అది ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఎప్పుడూ అందర్నీ నవ్వించే శ్రీను ఈ సినిమాలో నవ్విస్తూనే ఏడిపిస్తారు” అని అన్నారు. ఈ సినిమాకి స్వరాలు అందించి హర్షవర్దన్ రామేశ్వర్కు తాను అభిమానిని అని చెప్పిన తేజ, ‘రాజు యాదవ్’ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అంకిత ఖరత్ ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మే 17న విడుదల కానుంది.