18-11-2025 08:17:41 PM
కుభీర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో రెండవ పండరిపురంగా కొలిచే శ్రీ విఠలేశ్వర ఆలయం జాతర మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 11న ప్రారంభమైన అఖండ హరినామ సప్తాహ ముగిసింది. తెల్లవారుజామున రుక్మిణి–విట్టల విగ్రహాలకు అభిషేకం, పుష్పార్చన, పట్టువస్త్రాల సమర్పణ అనంతరం కన్నుల పండుగగా కాకడ హారతి నిర్వహించారు. తరువాత ప్రత్యేకంగా అలంకరించిన రథంలో స్వామివారిని భజనలు, మేళతాళాలతో పురవీధుల గుండా ఊరేగించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయంలో ఉట్టికొట్టే కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరిగింది. ఈ జాతరలో మొత్తం 32 క్వింటళ్ల అన్నదానం భక్తులకు పంపిణీ చేయబడింది. ఈ మహత్తర సేవను గ్రామంలోని మున్నూరుకాపులు మరియు యాదవులు కలిసి నిర్వహించడం విశేషం. భక్తుల సందడి మధ్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముధోల్ మాజీ ఎమ్మెల్యే జీ. విట్టల్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక సర్పంచ్ పానాజీ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, ఆలయ కమిటీ చైర్మన్ పెంటాజీ, మున్నూరుకాపు–యాదవ సంఘాల అధ్యక్షులు చిమ్మన్ అరవింద్, కందుర్ దత్తాత్రి,నాయకులు బోయిడి విట్టల్, తదితరులు పాల్గొన్నారు