పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే
* భూగర్భ జలాలు అడుగంటి పోతాయి
* వన్యప్రాణులకు ఆవాసం లేకుండా పోతుంది.
* బ్లాస్టింగ్ తో విష వాయువు సోకే ప్రమాదం
* గూడూరు గ్రామస్తుల ఆవేదన
* పల్లెగుట్ట సందర్శించిన భూరక్షణ ఉద్యమకారులు
ముస్తాబాద్,సెప్టెంబర్ 01( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండలం నామాపూర్ పరిధిలోని గూడూరు గ్రామ సరిహద్దులో ఉన్న పల్లగుట్టను ధ్వంసం చేసి ఖనిజాలు(Minerals) వెలికి తీసి అమ్ముకోవడానికి ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు ఉన్నాయంటూ గుట్ట పైకి దారి వేయడం జరిగింది.విషయం తెలుసుకున్న గూడూరు గ్రామ ప్రజలు ఏకమై మాజీ సర్పంచ్ చాకలి రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడం జరిగింది.
మంగళవారం పర్యావరణం, భూ రక్షణ ఉద్యమకారులు(Land conservation activists) పల్లగుట్టను సందర్శించి పర్యావరణాన్ని పరిశీలించారు. గ్రామస్తుల పోరాటానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఊరికి దూరంగా, నివాసం లేని ప్రాంతాల్లో మాత్రమే మైనింగ్ తీయడానికి అనుమతులు ఇస్తారు.కానీ "పల్లగుట్ట" గూడూరు గ్రామానికి ఆనుకొని ఉందనిఎలాంటి విచారణ జరుపకుండా మైనింగ్ యాక్ట్ ప్రకారం కోర్ట్ అలాగే ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందో అర్ధం కావడం లేదన్నారు. కుక్కను చంపితే కేసులు పెట్టె చట్టాలు ప్రజలకు జీవనాధారమైన గుట్టలను ధ్వంసం చేస్తే చట్టాలు అవసరం లేదా అని ప్రశ్నించారు.
గుట్టను బ్లాస్టింగ్ చేసే సమయంలో కెమికల్ ఉపయోగిస్తారని దాని వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుందన్నారు.పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలిని అందించడమే కాకుండా భూగర్భ జలాలు పెరగడానికి ఈ గుట్ట ఎంతో దోహదపడుతుందని తెలిపారు. హైకోర్టు న్యాయవాది కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి ఈ ప్రాంతం వారే కావడం విశేషం. వారు చొరువ తీసుకొని ఈ కాంట్రాక్టు ను రద్దు చేయించి నామాపూర్, గూడూరు గ్రామాల ప్రజలకు అండగా నిలవాలని, పచ్చని చెట్లతో ప్రకృతి అందాలతో ఉన్న పల్ల గుట్టను కాపాడాలని కోరారు.






