24-06-2025 07:58:13 PM
ప్రజావాణీలో ఫిర్యాదు చేసిన సోషల్ వర్కర్..
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ(MP Vamsi Krishna), మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) అండదండలతో పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట మాజీ సర్పంచ్ సయ్యద్ సజ్జాద్, పెద్దపల్లి శివారులోని 1698 సర్వే నంబర్లో 8 గుంటల భూమిని కబ్జా చేసాడని పెద్దపల్లికి చెందిన సోషల్ వర్కర్ ఎంఎ రహమాన్(షాకీర్) ప్రజావాణీలో కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. అలాగే రహమాన్ సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశాడు. సయ్యద్ సజ్జాద్ అనే వ్యక్తి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అనుచరుడుగా చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
పెద్దపల్లి శివారులోని 1698 సర్వే నంబర్లో ఉన్న 8 గుంటల భూమి కబ్జా చేసి ఆ భూమిని వెంచర్ చేసి తన అనుచరులతో కలిసి అమ్మకాలు చేస్తున్నాడు. అలాగే 1699 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో ఉన్న చెరువు నాలాను కూడా మట్టితో పూడ్చివేసి రోడ్డు వేసుకున్నాడని పేర్కొన్నాడు. తనకు ఎంపీ, మంత్రి అండదండలున్నాయనే, తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని రహమాన్ తన వీడియోలో పేర్కొన్నాడు. అక్రమాలకు పాల్పడుతున్న సయ్యద్ సజ్జాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరాడు.