21-06-2025 07:14:46 PM
అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్...
వలిగొండ (విజయక్రాంతి): మోడీ ఆర్థిక విధానాల వల్ల, పాలనలో వ్యవసాయ కార్మికులు, పేదలు, కౌలు రైతులు 60 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వారికి రక్షణ లేదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ ఆరోపించారు. ఉపాధి హామీకి నిధులు కోత పెట్టి కార్పొరేట్ శక్తులకు మాత్రం పెద్ద ఎత్తున సబ్సిడీలు ప్రకటించారని విమర్శించారు. ఈ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు కార్మికులు రైతాంగము సంఘటితంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు.
శనివారం వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు అమరజీవి కామ్రేడ్ వేముల మహేందర్ 4వ వర్ధంతి సందర్భంగా మహేందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు, ఉపాధి - పాలకుల వైఖరి పై నిర్వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా వెంకట్ పాల్గొని మాట్లాడుతూ... ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే యోగ ఒకటే కాదని ప్రజలందరికీ తినడానికి పోషక హారము ఉండాలని, ప్రభుత్వం పౌష్టికమైన హారము అందించాలని డిమాండ్ చేశారు.
గ్రామాలలో పేదలకు పనిచేసి బతకడానికి పని దొరకడం లేదని సరైన హారం లేదని దీనితో అనేక మంది పేదలు అనారోగ్యాలకు గురై చనిపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని, గత సంవత్సరం దేశవ్యాప్తంగా 380 కోట్ల పని దినాలు ఉంటే ఈ సంవత్సరం 280 కోట్ల పరిధినాలకు కుదించారని అన్నారు. ఉపాధి హామీ ఎత్తివేతకు మోడీ చేస్తున్న కుట్రలను వ్యవసాయ కూలీలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు దేశంలో ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోతుందని నిత్యవసర వస్తువుల వినియోగంలో 100 దేశాల కన్నా మన దేశం వెనుకబడి ఉన్నదని ఆవేదన వెలిబుచ్చారు. మోడీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త కొత్త విధానాలతో మచ్చిక చేసుకుని భారత దేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు.
మతం పేరుతో జనం మోడీ ప్రభుత్వానికి అణిగి మణిగి ఉండాలని చూస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీ విధానాల వల్ల భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకిక తత్వానికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షవాదులు, లౌకిక శక్తులు, ప్రజాతంత్ర వాదులు సంఘటితంగా ఐక్యంగా పోరాటాలను ఉధృతంగా కొనసాగించాలని వెంకట్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు ,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి, బి.ఎస్.పి రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య, గంగదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి సిరిపంగి స్వామి, గుంటోజు శ్రీనివాసాచారి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జూకంటి పౌల్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.