21-06-2025 12:00:00 AM
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం :
మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే కనీసం 25 రకాల ఆసనాలు వేయడం అవసరమని యోగా నిపుణులు చెప్తారు. మానవ శరీరం పలు రకాల మాలిన్యాలతో నిండి ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు తొలగించు కోవాలి. ఇందుకు యో గా చక్కటి పరిష్కారం. యోగాతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆసనాలను ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే వేస్తే మంచి పలితాలు సాధించ వచ్చని నిపుణులు అంటారు.
సిద్ధాసనం: ఈ ఆసనం వల్ల 72 వేల నాడులు శుద్ధి అవుతాయి.
బద్ద పద్మాసనం: గర్భాశయ రోగాలు, గ్యాస్ స్ట్రబుల్, కడుపు నొప్పి, అజీర్ణం, గూని, స్వప్న స్ఖలనాలు వంటివాటి నివారణకు ఇది దోహదపడుతుంది.
వజ్రాసనం: జీర్ణశక్తిని పెంచుతుంది. బొర్రను తగ్గిస్తుంది.
సర్వాంగాసనం: తల, కండ్లు, చెవి, ముక్కు, గొంతు రోగాలు తగ్గుతాయి. థైరాయిడ్ సమస్య రాదు. ఇది వివాహితులకు మంచిది.
ధనురాసనం: ఇది సర్వరోగనివారిణి. దీనివల్ల కాళ్ళు, చేతులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. కడుపులోని అనవసర కొవ్వుతగ్గడమేకాక జీర్ణశక్తి పెరిగి, ఆకలి ఏర్పడుతుంది.
మయూరాసనం: దీంతో గర్భకోశ సమస్యలు, నడుము నొప్పులు, లివర్ వ్యాధులు తొలగిపోతాయి. షుగర్ వ్యాధిని తగ్గించుకునేందుకు ఇది చక్కని పరిష్కారం.
భుజంగాసనం: స్త్రీలకు బాగా ఉపయోగకరం. గర్భాశయ బాధలు, వెన్ను, నడుము నొప్పులకు, ఋతుదోష నివారణలకు మంచిది.
పశ్చిమోత్తాసనం: ఇది అర్షమొలలు ఉన్నవారికి, షుగర్ వ్యాధితో బాధ పడేవారికి మంచిది. దీంతో సుషుమ్న నాడిలో ఉత్తేజం కలుగుతుంది.
మత్స్యాసనం: దీనివల్ల దీర్ఘ ఉచ్చ్వాస, నిచ్ఛ్వాసలు క్రమబద్ధమై ముక్కు కండరాల వాపు, ముక్కు దిబ్బడ, జలుబు తగ్గుతాయి. ముఖ రోగాలు తగ్గుతాయి. మలవిసర్జన బాగా జరుగుతుంది.
గోముఖాసనం: దీనివల్ల అర్షమొలలు తగ్గుతాయి. కాళ్ళకు భుజకీళ్ళు, మెన్నెముక, తొడల వాతపు వాపులు నివారణవుతాయి.
కుక్కుటాసనం: దీంతో నాడీ ప్రసారం బాగా జరుగుతుంది. చేతులు, కాళ్ళ కండరాలు ధృడంగా తయారవుతాయి.
ప్రాణాయామం: యోగాసనాలు వేసిన పిదప ప్రాణాయామం చేయడం వల్ల మానసికంగా ఉత్తేజితులు అవుతారు. అందుకే, ఆసనాల తదుపరి ఇది చేయడం మంచిది.
- నట్టే కోటేశ్వర్రావు