20-06-2025 12:00:00 AM
భారతీయ సాంస్కృతిక చరిత్రలో సినిమాను ఒక సామూహిక శక్తిగా తీర్చిదిద్దిన తొలితరం కళాకారులలో చందాల కేశవదాసు ఒకరు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా సమానతా భావంతో జీవితాన్ని గడిపిన ఆయన జీవితం, సాహిత్యం, కళాసేవ అన్నీ ఆదర్శనీయమే. 1931లో భారతదేశంలో తొలి శబ్దచిత్రంగా విడుదలైన ‘ఆలమ్ ఆరా’ (తొలి హిందీ టాకీచిత్రం) విడుదలైన ఏడాదే, తెలుగుభాషలో తొలి శబ్దచిత్రం ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది.
ఈ చిత్రానికి గీత రచయితగా వ్యవహరించిన వారు చందాల కేశవదాసు. వీరు కేవలం సినిమా రంగానికే కాదు హరికథ, నాటక రంగం, అవధాన సాహిత్యం వంటి అనేక ప్రక్రియలలో తన కౌశలాన్ని చూపారు. చందాల కేశవదాసు ప్రథమ తెలుగు నాటకకర్తగా గుర్తింపును పొందడమమే కాదు, ప్రథమ తెలుగు సినీ గేయ రచయితగా స్థానం పొందారు.
‘భక్త ప్రహ్లాద’ సినిమాకు ఆయన రాసిన పాటలు ఆ కాలపు భక్తి భావనలకు, సంగీత అనుభూతికి ప్రాతినిధ్యంగా నిలిచాయి. అచ్చు తెలుగు పదాలను గీతాల్లో అన్వయించడంలో ఆయనకు శైలి అద్భుతం. కేశవదాసు రాసిన కరుణాసుధ, ధర్మవేతాళ వంటి నాటకాలు 19వ శతాబ్దం చివరి నాట్య వ్యవస్థలో కీలక పాత్ర పోషించాయని కొలచల శేషగిరి తెలుగు నాటక పరిణామంలో పేర్కొన్నారు.
కేశవదాసు జీవితం 1876 జూన్ 20న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామంలో ప్రారంభమైంది. వీరి తల్లిదండ్రులు పాపమ్మ, లక్ష్మీనారాయణలు. వీరి కుటుంబంలో వైద్యసేవకు ప్రత్యేక స్థానం ఉంది. కేశవదాసు తాత శ్రీనివాసులు ఖమ్మం జిల్లా గంగిరెడ్డిపాడు గ్రామంలో వైద్యునిగా సేవలందిం చే వారు. ఈ వృత్తి వారసత్వంగా కాకు న్నా కుటుంబ పరంపరలో సేవామార్గం స్పష్టంగా కనిపిస్తుంది.
బాల్యంలోనే త్ంర డిని కోల్పోయిన దాసు అన్న వెంకటరమణ యోగి సంరక్షణలో పెరిగారు. చం దాల అనే పేరు ఒక ఆసక్తికరమైన భాషా పరిణామానికీ, వృత్తి చిహ్నానికీ ఉదాహరణ. గుంటూరు జిల్లాలో పురాతనంగా ఉన్న చందోలు గ్రామమే, వాడుక భాషలో చందవోలుగా మారింది. కేశవదాసు తాత శ్రీనివాసులు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్న నేపథ్యంతో వారి కుటుంబాన్ని చందాలవారి పిలిచే పద్ధతి ఏర్పడింది. ఈ పేరే వారసత్వంగా మారింది.
‘భక్త ప్రహ్లాద’లో తొలిపాట
చందాల కేశవదాసు కుటుంబ జీవితం అనేక మలుపులతో కూడింది. పిల్లల లేని కారణంగా, కేశవదాసు పలు వివాహాలు చేసుకోవాల్సి వచ్చింది. మొదటి వివాహం ద్వారా సంతానం లేకపోవడం, అనంతరం రెండవ వివాహం, భార్య మృతి. ఆయన జీవితంలో విషాదం నెలకొంది.
శిష్యుల ఒత్తిడివల్ల మరో రెండు వివాహాలు చేసుకున్నా వాటిద్వారా స్థిరత్వం రాలేదు. చివరకు ఐదవ వివాహంగా చిట్టమ్మను వైవాహికంగా స్వీకరించాల్సి వచ్చింది. ఈ వివాహాల ఫలితంగా ఆయనకు పిల్లలు కలిగారు. మూడవ భార్యద్వారా రామకవి అనే కుమారుడు జన్మించగా, ఐదవ భార్య చిట్టమ్మ ద్వారా ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల జన్మించారు. వీరు రచయితగా ఎన్నో పాటలు రాశారు.
‘భక్త ప్రహ్లాద’ (1935)లో ‘పరితాప భారంబు భరింప తరమా’ చందాల రాసిన తొలి సినిమా పాట. ఇదే చిత్రంలో ‘తనయా తగు పలుకు’, ‘భీకరమగు నా ప్రతాపంబునకు నీతి లేక ఇటు చేసే దయ’ అనే పాటలు రాశారు. ‘సతీ సక్కుబాయి’ (1935) సినిమాకు ‘కృష్ణా పోబోకురా, రాదేలా కరుణా, ఆటలాడుకోరా పాలు మీగడ పలుమార్లు భుజించి, పాషాణం ఎ టు లైతివో, జాగేలా కావగ రారా’ శ్రీకృష్ణ తులాభారం (1935)లో ‘భలే మంచి చౌక బేరం’, ‘మునివరం తుదికిట్లు నానున్ మోసగించురా’, ‘కొట్టు కొట్టండి బుర్ర పగలగొట్టండి’, ‘సతీ అనసూయ’ (1935)లో ‘దేవుని దయ వుంది ఐలెసో’,
‘ప్రహ్లాదు గావ స్తంభము నృహరివై’, ‘మా తనయని మాట విని’, ‘కురతే గంగా సాగర సంగమం’, ‘కనకతార’(1937)లో ‘దప్పిచే నాలుక తడి పొడి లేక’, ‘ఎంత బాగుండేది సక్కని గుంటారమే’ వంటి పాటలు రాశారు. ఇవే కాకుండా ‘రాధాకృష్ణ’ (1939), ‘బాలరాజు’ (1948), ‘లంకా దహనం’ చిత్రాలకు పాటలు రాశారు.
సాహిత్యం నుంచి రంగస్థలం వరకూ!
తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలో గేయ రచనలకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ఈ ప్రక్రియకు ఆధునిక రూపాన్ని కలిగించి, కవితా శైలిని శ్రవ్యరూపంలో ప్రజల్లోకి తెచ్చిన మొదటి గేయ రచయితగా చందాల కేశవదాసు గుర్తింపు పొందారు. 1931లో హిందీలో తొలి శబ్దచిత్రం (ఆలం ఆరా) విడుదలైన నలభై రోజుల్లోనే తెలుగులో విడుదలైన తొలి శబ్దచిత్రం (భక్త ప్రహ్లాద)లో పాటలు రచించిన ఘనత వీరిదే.
చందాల కేశవదాసు సాహిత్య దృక్ప థం అనేక రూపాలుగా విస్తరించింది. వారు కేవలం హరికథా రచయి తగా గాక శతకకర్తగా, నాటక రచయితగా, గేయ రచయితగా, సినీ సంభా షణకర్తగా, అష్టావధానిగా, పద్యకర్తగా కూడా వెలుగొందారు. కేశవదాసు రాసిన కేశవ శతకం ఆచార్య కవుల సంప్రదాయాన్ని అనుసరించినప్పటికీ మానవీయత, భక్తి, మానసిక విలువలతో నిండి ఉంటుంది.
ఇందులోని పద్యాల్లో లక్షణాపూరితమైన శైలితోపాటు ఆచరణా త్మక ధర్మబోధన ఉంది. గేయరచనలలో శ్రీ రామ నామామృత గేయం (1922) భక్తిపర గీతంగా గుర్తింపు పొందింది. అలాగే మేలు కొలుపులు, జోల పాటలు, పంచరత్నాలు వంటి పాటలలో సామాజిక సునిశిత వ్యంగ్యం, మానవీయ స్పృహ, జాగృతి పిలుపు కనిపిస్తాయి.
రచయితగా మాత్రమే కాక పీఠికా రచయితగానూ కేశవదాసు కీలక పాత్ర వహించారు. కేశవదాసు రంగస్థలంలో నటుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. ‘కనకతార’ నాటకంలో ఉదయసేన నాయకుడిగా, ‘పాదుకా పట్టాభిషేకం’ నాటకంలో దశరథుడిగా వారి నటన ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఆయన రాసిన ‘లంకా దహనం’ నాటకం తర్వాత చిత్రరూపంలోకి వచ్చిన మొదటి రచన.
కేశవదాసు కళకు, భక్తికి చేసిన సేవలు కేవలం రచనలకే పరిమితం కావు. కోదాడ మండలంలోని తుమ్మర గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురాన్ని నిర్మించారు. ఆనాటి మైలవరం రాజావారు స్థాపించిన ‘బాలభారత సమాజం’ అనే నాటక సంస్థ కేశవదాసు ఆధ్వర్యంలోనే నడిచింది. కేశవదాసు తాను రచించిన నాటకాలను, హరికథలను ప్రదర్శించేందుకు, వివిధ ప్రాంతాలలోని నాటక సంస్థలను ఆహ్వానించే వారు.
సంపాదనలో కొంత ప్రజాసేవకు!
చందాల కేశవదాసు సాహిత్య కృషిద్వారా, హరికథా ప్రవచనాల ద్వారా తెలుగు జనాలలో చిరస్మరణీయ స్థానాన్ని పొందారు. వీరికి దక్కిన మూడు బిరుదులు ఆంధ్ర సూత, కలియుగ దశరథ నటన వంతస, లయ బ్రహ్మ. చందాల కేశవదాసు తెలుగు సాహిత్యంలో తొలితరం టాకీ గేయ రచయితగా, హరికథ కారునిగా, నాటకకర్తగా విశిష్టస్థానం కలిగినప్పటికీ ఆయనపై ప్రత్యేక పరిశోధనలు అతికొద్ది మాత్రమే ఉన్నాయి. పరిశోధన చేసిన వ్యక్తి డాక్టర్ ఎం. పురుషోత్తమాచార్యులు.
మరోవైపు, చందాల కేశవదాసు జీవన విశేషాలను సామాన్య పాఠకులకు చేరువ చేసే ప్రయత్నంలో ‘తెలుగు మణిదీపాలు’ అనే సంకలనం ఎంతో ఉపయుక్తమైంది. ఈ గ్రంథంలో రేపాక రఘునందన్ రచించిన వ్యాసం ద్వారా కేశవదాసు వ్యక్తిత్వం, జీవిత విస్తృతి, నిబద్ధత ఆవిష్కరించారు. చందాల కేశవదాసు తన సంపాదనలో కొంతభాగం ప్రజాసేవకు వినియోగించారు. ముఖ్యంగా ప్రతీ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలలో యాత్రికులకు అన్నదాన కార్యక్రమాలు చెప్పట్టేవారు. తిరువూరులో ఆయన తవ్వించిన బావిని ‘దాసుగారి బావి’గా పిలుస్తారు.
నిజాం పాలనలోని రజాకార్ల దౌర్జన్యాల నుంచి దాసు కూడా తప్పిం చుకోలేకపోయారు. 1948 జూలైలో జక్కేపల్లిలో ఉన్న ఆయన ఇంటిపై రజాకార్లు దాడి చేశారు. ధన నష్టంతోపాటు నలభై ఏళ్ల సాహిత్య సంపద ధ్వంసమైంది. కుటుంబ పరంగా దాసు వారికి ముగ్గురు సంతానం రామకవి, కృష్ణమూర్తి (వైద్యుడు), సీతారామయ్య (ఉపాధ్యా యుడు). చివరి దశలో కేశవదాసు కుమారుడు కృష్ణమూర్తి వద్ద నాయక్గూడెంలో నివసిస్తూ 1956 మే 14న ఆయన పరమ పదించారు.
వ్యాసకర్త సెల్: 8801444335