5 April, 2026 | 8:33 PM

ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో లంచ్ మోషన్

02-12-2024 01:12 PM

హైదరాబాద్: తెలంగాణలోని ములుగు జిల్లా ఏటారునాగారం ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. మావోయిస్టుల భోజనంలో విషప్రయోగం జరిగిందని పటిషనర్ ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు విచారణ చేపట్టనుంది. మృతదేహాలను వైద్యనిపుణుల సమక్షంలో పోస్ట్ మార్టం జరగాలని, పోస్టుమార్టం సమయంలో వీడియో రికార్డు చేయాలని పిటిషన్ కోరారు.

తెలంగాణలోని ములుగు జిల్లాలో పోలీసు ఇన్‌ఫార్మర్లు అనే అనుమానంతో ఇద్దరు గిరిజనులను హత్య చేసిన వారం తర్వాత ఆదివారం ఉదయం భద్రతా దళాలు ఏడుగురు మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి. ఆదివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టు వ్యతిరేక గ్రేహౌండ్స్ బలగాలు చల్పాక అడవుల్లో మావోయిస్టులను గుర్తించి లొంగిపోవాలని ఆదేశించాయి. మావోయిస్టులు లొంగిపోలేదని, బదులుగా కాల్పులు జరిపారని, దీంతో వారు ఎదురు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ సమయంలో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో 43 ఏళ్ల ఏగోళపు మల్లయ్య, బద్రు 35, 22 ఏళ్ల ముస్సాకి దేవల్, 23 ఏళ్ల ముస్సాకి జమున, 25 ఏళ్ల జై సింగ్, 23 ఏళ్ల కామేష్, 22 ఏళ్ల కిషోర్‌గా గుర్తించారు. వారందరికీ భద్రు నాయకత్వం వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.