29-05-2025 05:47:09 PM
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతానని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) తెలిపారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎవరూ కొత్త పార్టీ పెట్టరని, ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదని ఈటల పేర్కొన్నారు. పక్క రాష్ట్రం ఏపీ అద్భుతంగా అభివృద్ది చెందుతుందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే బాగుండాని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ఎందుకు విలీనం అవుతుంది.. మేమెందుకు చేసుకుంటామని ఆరోపించారు. కవిత(MLC Kavitha) ఉద్యమకారులను కలిసి ఏం చేస్తుంది..? కవిత దగ్గర ఉద్యమకారుల లిస్ట్ ఉందా..? అని ఈటల మండిపడ్డారు. నక్సలైట్ల అంశంపై కేసీఆర్(KCR) ద్వంద వైఖరి అవలంబించారని, అధికారంలోకి రాక ముందే జైలుకు వెళ్లి కూర రాజన్నను కేసీఆర్ కలిశారని తెలిపారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా వచ్చిందని, బీజేపీ స్టేట్ ఫైట్ తప్ప.. స్ట్రీట్ ఫైట్ చేయదని ఈటల పేర్కొన్నారు. పదేళ్లు కేసీఆర్ ను నమ్మి ప్రజలు మోసపోయారని, కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు మరోసారి మోసపోయారన్నారు. ఏపీ అభివృద్దిలో దూసుకుపోతుంటే తెలంగాణ వెలవెలబోతుందని, అప్పుల నుంచి రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈటల తెలిపారు. బీజేపీలో.. బీఆర్ఎస్ విలీనం అనే గాలి వార్తలకు సమాధానం చెప్పనని, కవిత తెలంగాణ వాదులను కలవడం నేరం కాదని అన్నారు. నాయకులు, కుటుంబీకుల ఫోన్లు ట్యాప్ చేయడం మాత్రం నేరమని తెలిపారు. నేతల మధ్య కేసీఆర్ కంచెలు నాటారని, దానిని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొనసాగిస్తున్నారన్నారు.