20-02-2026 12:00:00 AM
మేడిపల్లి, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : మరొకరి ప్లాటును తప్పుడు పత్రాలతో విక్రయించిన వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే తోకల గోపాల్ అనే వ్యక్తి ఆయన తల్లి యశోద బోడుప్పల్ లో సర్వే నెంబర్ 56, 57లో ఉన్న ప్లాట్ నం. 2, విస్తీర్ణం 310 చదరపు గజాలు గల భూమిని 2001 సంవత్సరంలో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చూశారు.
అప్పటి నుండి వారి చట్టబద్ధ యాజమాన్యం ఆధీనంలో ఉంచుకున్నారని పేర్కొన్నారు. అయితే, 2025 సంవత్సరంలో శ్రీహరి అనే వ్యక్తి యశోద జీవించి ఉన్నప్పటికీ, ఆమె పేరుతో తప్పుడు మరణ ధృవపత్రం, లీగల్ హెయిర్ ధృవపత్రం తయారు చేసి, పాచునూరి గీత ద్వారా తప్పుడు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జిపిఏ)ను కాచాటి శ్రీహరి పేరిట ఎస్ఆర్ఓ, ఉప్పల్ కార్యాలయంలో నమోదు చేసినట్లు ఆరోపించబడింది.
తద నంతరం, అదే ప్లాట్ను బొడుప్పల్కు చెందిన సునీత అనే మహిళకు సేల్ డీడ్ ద్వారా విక్రయించినట్లు బాధితులు ఈనెల 13న పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇట్టి కేసులో నిందితుడు కాచాటి శ్రీహరిని అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా, ఆయనను న్యాయస్థాన ఉత్తర్వుల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించబడినదని పోలీసులు తెలిపారు.