20-11-2025 12:40:30 AM
హైదరాబాద్, నవంబర్ 19 (విజయ క్రాంతి): ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను ప్రభుత్వం హత్య చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై వెంటనే సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల విషయంలో న్యాయస్థానాలు కూడా స్పందించడడం లేదని, ఈ పరిస్థితి చాలా నష్ట దాయకమన్నారు. బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హిడ్మాను కొట్టి చంపి దానికి ఎన్కౌంటర్ అనే పేరు పెడుతున్నారని విమర్శిం చారు. ఎన్కౌంటర్ అంటే పరస్పర కాల్పులు జరగా లి కదా అని ప్రశ్నించారు. ఏకపక్షంగా కాల్పులు జరపడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్కౌంటర్ అంటున్నార ని విమర్శించారు. మావోయిస్టులతో చర్చిం చి సమస్యలను తెలుసుకోవాల్సింది పోయి చంపుతున్నారని మండిపడ్డారు.
2026 మార్చి వరకు మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటించారని గుర్తు చేశారు. అందులో భాగంగా హిడ్మా దంపతుల ఎన్కౌంటర్ బూటకమన్నారు. కాల్పులు విరమించుకుంటున్నామని ప్రకటించినా చంపుతున్నారని, దండకారణ్యంలోని ఖనిజాల కోస మే ఇదంతా చేస్తున్నారని కూనంనేని ఆరోపించారు. ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.