calender_icon.png 14 November, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ పురోగతి కోసం కలిసి నడుద్దాం

14-11-2025 05:32:27 PM

ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దేశ పురోగతి కోసం మహనీయుల ఆశయాల స్ఫూర్తిగా కలిసి నడుద్దామని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ అన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేరా భారత్ ఐక్యత మార్చ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు, జిల్లా అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులతో కలిసి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి సమీకృత కలెక్టరేట్ భవనం నుండి కొమురం భీం చౌరస్తా మీదుగా తిరిగి సమీకృత కలెక్టరేట్ భవనానికి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ దేశ పురోగతి కోసం అందరం కలిసి నడుద్దామని తెలిపారు. వల్లభభాయ్ పటేల్ దేశం కోసం, దేశ ఐక్యత కోసం అహర్నిశలు కృషి చేశారని, స్వాతంత్రోద్యమ పోరాటంలో తన వంతు పాత్ర పోషించి, స్వాతంత్రానంతరం దేశంలోని ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని తెలిపారు. వ్యూహాత్మక దృఢత్వం, విలీన సాధనం ద్వారా ఎన్నో రాజరిక రాజ్యాలను విజయవంతంగా ఏకం చేసి భారత దేశాన్ని ఒక సమగ్రమైన, స్థిరమైన దేశంగా మలిచారని తెలిపారు. ఏక్ భారత్ - ఆత్మనిర్బర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించి దేశ ఆర్థిక రంగాన్ని సమిష్టిగా బలోపేతం చేద్దామని తెలిపారు. 

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారతదేశ తొలి హోం శాఖ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఎన్నో ఉన్నతమైన పదవులలో పని చేసి దేశ సమగ్ర అభివృద్ధిలో పాలుపంచుకున్నారని, వల్లభభాయ్ హయాంలో ఏర్పాటు అయిన సంస్థలు నేటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని నేటి యువత దేశ ఐక్యత, పటిష్టత, అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మేరా భారత్ కార్యక్రమం ఇంచార్జ్, జిల్లా యువ అధికారి శైలి బెల్లాల్, నోడల్ అధికారి రమాదేవి, జిల్లా క్రీడా యువజన శాఖ అధికారి అహ్మద్, జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.