calender_icon.png 30 May, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార సంఘాల ద్వారా రూ. 3 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం

26-05-2025 01:41:46 PM

రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

4 పిఏసిఎస్ ఆధ్వర్యంలో ముందస్తుగా సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు

గుంజపడుగు ప్యాక్స్ కార్యాలయం నందు పీఎం కుసుమ్ క్రింద సోలార్ ప్రాజెక్ట్ మంజూరు పత్రాలు అందించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (విజయక్రాంతి): 3 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ను మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం  మంథని మండలం గుంజ పడుగు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ లో  రూ.2.90 కోట్ల నిధులతో పీఏం కుసుమ్ కార్యక్రమం క్రింద చేపట్టనున్న సోలార్ ప్రాజెక్టు మంజూరి పత్రాలను  మంత్రి  శ్రీధర్ బాబు , కరీంనగర్ డిసిసిబి చైర్మన్ కే. రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  తో కలిసి  పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కుసుమ్ పథకాన్ని రైతులకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అనుకూలంగా ఉండేలా రాష్ట్రంలోనే మొదటిసారిగా మన జిల్లాలో 4 చోట్ల సోలార్ ప్రాజెక్టు మంజూరు చేసుకున్నామని , దీనికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పిఏసిఎస్ మంథని, పిఏసిఎస్ అప్పన్నపేట, పిఏసిఎస్ కాల్వ శ్రీరాంపూర్, పిఏసిఎస్ ధర్మారం, పిఏసిఎస్ చొప్పదండి పరిధిలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కరీంనగర్ సహకార బ్యాంకు నుంచి రూ. 3 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసినందుకు సంబంధిత అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.  

ప్రతి సంవత్సరం వ్యవసాయ సహకార సంఘాలకు సోలార్ ప్రాజెక్టు ద్వారా రూ. 50 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న  ప్యాక్స్ ద్వారా సంవత్సరానికి రూ.  7300 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు.  వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పెట్రోల్ పంప్, రైస్ మిల్ వంటి వివిధ వాణి వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు కృషి జరుగుతోందని జిల్లాలో ఉన్న 131 పిఏసిఎస్ లలో కూడా పీఎం కుసుమ్ క్రింద సోలార్ ప్రాజెక్టు విస్తరించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న విద్యుత్ అవసరాలను తీరుస్తూ మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాలకు ఆదాయ వనరులు సృష్టిస్తున్నామని మంత్రి తెలిపారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులకు, పరిశ్రమలకు గృహ వినియోగదారులకు ఇబ్బంది రావద్దని ప్రజా ప్రభుత్వం విద్యుత్  సంస్కరణలు తీసుకొని వచ్చిందని, 3 వేల మెగావాట్ల ఉత్పత్తి మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.  జిల్లాలో సహకార సంఘాల తో పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కు కలెక్టర్ అధ్యక్షతన కృషి చేయాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ  పీఎం కుసుమ్ క్రింద ప్రతి మండలంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మన జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చే కూడా సోలార్ ప్రాజెక్టు పెట్టించాలని నిర్ణయించి 4 ప్యాక్స్ ఎంపిక చేసి అవసరమైన భూమి గుర్తించి మంజూరు చేస్తున్నామని తెలిపారు.

ఎన్.పి.డి.సి.ఎల్ , నాబార్డ్ తో  ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం కనీసం 50 నుంచి 70 లక్షల వరకు ఆదాయం వస్తుందని , ప్యాక్స్ వద్ద నిధులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో  సిరిసిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్.డి.ఓ. సురేష్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, తాసిల్దార్ కుమారస్వామి, నాయకులు ఐలి ప్రసాద్, శశి భూషణ్,  కాచే, ఒడ్నాల శ్రీనివాస్, డైరెక్టర్ లు, సిఈఓ అశోక్,  అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.