12 August, 2026 | 11:43 AM

17 న పెద్దపల్లిలో మంత్రుల పర్యటన

12-08-2026 09:30 AM

ఆర్ అండ్ బి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 

గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ 

తారు రోడ్లుగా అభివృద్ధి 

ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  విజయ రమణారావు 

సుల్తానాబాద్ ,(విజయక్రాంతి):  ఈనెల 17న రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కొత్త రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చెప్పారు. మంగళవారం సాయంత్రం  సుల్తానాబాద్ పట్టణం, మండలంలోని గర్రెపల్లి గ్రామంలో  స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు, ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని అనేక గ్రామాలను కలుపుతూ రూ.99 కోట్లతో గర్రెపల్లి నుండి పెగడపల్లి వరకు నిర్మించే తారు రోడ్డుకు మంత్రులచే గర్రెపల్లి గ్రామంలో శంకుస్థాపన చేయడంజరుగుతుందన్నారు.

అనంతరం సుల్తానాబాద్ నుండి పెద్దపూర్ వరకు రూ.42 కోట్ల చే నిర్మించే రోడ్డుకు సుల్తానాబాద్ పట్టణంలో శంకుస్థాపన కార్యక్రమం, అనంతరం ఇక్కడే బహిరంగ సభ ఉంటుందన్నారు. కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి మండలాల్లో రోడ్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, గంగారం నుండి పందిళ్ళ, కూనవరం చౌరస్తా నుండి ముత్తారం వరకు రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్,మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, సుల్తానాబాద్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు నామిని రాజిరెడ్డి, కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్ కల్లేపల్లి జానీ , మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దామోదర్ రావు, సర్పంచులు, ఉపసర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..