03-01-2026 09:23:08 PM
మానకొండూర్,(విజయక్రాంతి): ఒడ ఎక్కేదాకా ఒడ మల్లన్న ఒడేక్కాక బోడి మల్లన్న అన్న చందంగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరు ఉందని, సాధారణ ఎన్నికలప్పుడు లబ్ధిపొందేందుకు డబుల్ రోడ్ పేరుతో రాజకీయం చేసి ప్రజల ఓట్లతో గద్దెనెక్కి.. తీరా డబుల్ రోడ్ ను రెండ్లు సంవత్సరాలు అయినా పూర్తి చేయకుండా చేతులెత్తేసిన ఘనత కవ్వంపల్లికే దక్కుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఎద్దేవా చేశారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వంద రోజుల్లో గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు రెండు వరుసల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా ప్రజలను నిండా ముంచి అవస్థల పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంకర తేలిన రోడ్డుతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, గునుకుల కొండాపూర్ వద్ద ప్రమాదకరంగా ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ శాశ్వత చర్యలు తీసుకోలేదని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి నిర్లక్ష్య వైఖరితో రోడ్డు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రభుత్వం, సంబంధిత మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు మంజూరు చేయించి పనులను వెంటనే ప్రారంభించాలని లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉధ్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.