09-06-2025 08:38:25 PM
మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే అల్టిమేటమ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలో గత ప్రభుత్వంలో గ్రీన్ లాండ్, ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన విషయంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) అధికారులకు అల్టిమేటమ్ జారీ చేశారు. ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకోవడం, వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు అనుమతులు ఇవ్వడం, ఉదాసీనంగా వ్యవహరించడం సరైనది కాదని, వెంటనే ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ కార్యాలయంలో పట్టణ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలో మహబూబాబాద్ పట్టణం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, అయితే కొందరు అధికారుల తీరు తలనొప్పిగా మారిందని పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు ప్రణాళిక చేపట్టాలని ఆదేశించారు. పట్టణ ప్రజలకు రైల్వే ట్రాక్ అడ్డుగా ఉందని, నిత్యం రైల్వే ట్రాక్ దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సేవలందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.