26-01-2026 03:57:56 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకే సిగ్నల్ వ్యవస్థను ఏర్పర్చినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల రోడ్డు చౌరస్తాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థను పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ లతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... నిత్యం వాహనాలు పెరుగుతున్నాయని తద్వారా ట్రాఫిక్ అధికంగా పెరుగుతుందని ట్రాఫిక్ వ్యవస్థతో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా ప్రమాదాలను నివారించేందుకు సిగ్నల్ లైట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
అంబేద్కర్ చౌరస్తా నుండి గట్టేపల్లి రోడ్డు వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న రోడ్డులో త్వరలోనే అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన సిగ్నల్ వ్యవస్థను ప్రారంభిస్తామని అన్నారు. ఎంపీడీవో కార్యాలయం సమీపన 50 లక్షలతో నిర్మాణం చేపడుతున్న ఐలాండ్ వద్ద సైతం ట్రాఫిక్ సిగ్నల్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. రహదారులు విశాలంగా విస్తరించి రాకపోకలు అనేకంగా సాగుతున్నాయని తద్వారా విపరీతమైన రద్దీ పెరుగుతోందని దానికి అనుగుణంగా ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఉంటాయని తెలిపారు.
డిసిపి రామ్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఈ ప్రాంతం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విశాలమైన రహదారుల నిర్మాణాలను చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని, పెద్దపల్లి నియోజకవర్గంలో సమ్మక్క సారలమ్మ జాతరల వద్ద కోట్లాది రూపాయలతో రహదారులు నిర్మాణం చేపట్టి సమ్మక్క కు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా కృషి చేయడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సిఐలు సుబ్బారెడ్డి, అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్, ఎస్సైలు చంద్రకుమార్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, ప్రముఖ వ్యాపారవేత్తలు నగునూరి అశోక్ కుమార్, మాడూరి ప్రసాద్, చకిలం మారుతి, వేగోళం అబ్బయ్య గౌడ్, ముత్యాల రవీందర్, కందుకూరి ప్రకాష్ రావు, గాజుల రాజమల్లు, బిరుదు కృష్ణ, సర్కిల్ పరిధిలోని ట్రాఫిక్, సివిల్ ఎస్ఐ లు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ల తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు.