2026 నాటికి ‘ముంబై’లో తాగునీరు పుష్కలం
2021లో 9.7 కి.మీ సొరంగం తవ్వకాలు షురూ
మొదటి దశలో 4.3 కి.మీ మేర పూర్తి..
2026 ఏప్రిల్ నాటికి నీటి సరఫరా షురూ
ముంబై, జూన్ 22: ముంబైవాసులకు 2026 ఏప్రిల్ నాటికి తాగునీరు అందించేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 2021లో ప్రతిష్ఠాత్మకంగా నగరంలో 9.7 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే మొదటి దశలో హెగ్డేవార్ పార్క్ నుంచి ప్రతీక్ నగర్ వరకు 4.3 కిలోమీటర్లకుపైగా సొరంగం పూర్తి చేసింది. ఈ పనులు 74శాతం పూర్తయినట్లు లెక్క. ప్రస్తుతం చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. 2026 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసి తాగునీటి సరఫరా ప్రారంభిస్తామని మున్సిపల్ అధికారులు వెల్లడిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) విధానంతో ఈ సొరంగం పనులు సాగుతున్నాయి. భూగర్భంలో రాళ్ల దొంతరలు, కఠినమైన భూపొరలను తొలిచేందుకు ఇంజినీర్లు, సిబ్బంది, కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు.






