09-08-2024 12:00:00 AM
నేడు నాగుల పంచమి :
‘స్కాంద పురాణం’లో నాగదేవత విశిష్టతను సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి వివరించాడు. ఆదిశేషుణ్ణి తల్పంగా చేసుకున్న విష్ణుమూర్తి శేషుణ్ణి ఏదైనా వరం కోరుకొమ్మంటాడు. అతడు “నాగజాతి ఉద్భవించిన ఈరోజు మానవాళి మాకు పూజలు చేయాలి” అని కోరుకున్నాడు. దీనిని మన్నిస్తూ శ్రీహరి “తథాస్తు” అంటాడు. ఇవాళ్టి రోజును ‘గరుడ పంచమి’గానూ జరుపుకుంటాం. దీనికీ కారణం లేకపోలేదు.
ఎందుకీ పూజలు?
కశ్యప ప్రజాపతికి, కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, శంఖుడు, కర్కోటకుడు, నహుషుడు, ఐరావతుడు మొదలైన వారు జన్మించారు. వీరు కనబడిన వారినల్లా కాటు వేస్తూ అందరినీ భయభ్రాంతులను చేయసాగారు. దేవతలంతా బ్రహ్మను వేడుకోగా ఆయన కోపింతో, “తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారు” అంటాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై, “మమ్మల్ని మీరే సృష్టించి ఇలా శాపమివ్వడం న్యాయమా?” అని వేడుకుంటారు. “విషంతో పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణికోటిని నశింపజేయడం తప్పుకదా? నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని తప్పించుకు తిరగండి. సాధు జీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాళాలలో నివాసం ఉండండి” అని బ్రహ్మ ఆదేశిస్తాడు.
భక్తిశ్రద్ధలతో తెల్లవారు ఝామునే నిద్ర లేచి స్నానం చేసి శుచిగా చలిమిడి, నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు, వడపప్పు, పానకం, ఆయా కాలాల్లో దొరికే పండ్లు సేకరించి నాగమయ్య పుట్టలున్న చోటికి వెళ్లి పూజలు చేస్తారు. ఆవుపాలు పుట్టలోకాక పక్కన ఒక మట్టిమూకుడును ఉంచి, అందులో పోయడం ఉత్తమం. సంతానం లేనివారు జోడు నాగదేవతల ప్రతిష్ఠ చేయిస్తారు. గరుడుడు తమ జాతిని నశింపజేయకుండా ఉండాలని ఆదిశేషుడు శ్రీమన్నారాయణ మూర్తిని వరం కోరుకుంటాడు.
కాటు వేయవద్దంటూ ప్రార్థనలు
‘చూసీ చూడక నీ తోక తొక్కితే తొలగిపో, నడుము తొక్కితే నడిచిపో, పడగ తొక్కితే పారిపో’ అంటూ భక్తిపూర్వకంగా మొక్కుకుంటారు. ఇంటికి వచ్చి గడప ముందు అయిదు రాళ్లను వరుసగా పెట్టి, పప్పు పానకం నైవేద్యం పెడతారు. ‘ఆ హద్దుదాటి లోపలికి రావద్దని’ నాగరాజును ప్రార్థిస్తారు. ఈరోజు చెంబులో పుల్లలు పెట్టడం, స్త్రీలు కళ్లు నలుమడం, కాటుక పెట్టడం వంటివి చేయరు. అంతేకాక, రైతులు పొలం పనులు చెయ్యరు. గునపంతో నేలను తవ్వరు. చెట్ల మొదళ్లలోని పుట్టలకు వర్షం నీరు పోవడం వల్ల పాములు బయటకు వచ్చి కొమ్మలను చుట్టుకొని ఉండవచ్చు కనుక, చెట్లెక్కడం, కొమ్మలు విరవడం చేయరాదు. చిన్నపిల్లలకు చెవి వ్యాధులు ముఖ్యంగా స్నానం చేస్తున్నప్పుడు, ఈత కొడుతున్నప్పుడు లోనికి నీరు వెళ్లడం, చీము కారడం వంటి గండాలు తొలగి పోవాలని పుట్టమన్ను పెడతారు.
నాగుల చవితినాడు కాని, పంచమి నాడు కాని పుట్టమన్నును ఒలువరు. తెల్లవారి పుట్టమన్ను ఇంటికి తెచ్చిచ్చిన వారికి బహుమానాలు ఇస్తారు. పుట్టమీద కప్పిన పత్తి, వస్త్రం, తుండుగుడ్డను మూడవ రోజు తీసి శుభ్రం చేస్తారు. కొందరు పాములకు గుడ్లు, నాణాలు కూడా వేసి పూజిస్తారు. ఇవాళ ‘గరుడ పంచమి వ్రతం’ చేసుకునేవారు 10 ముడులు వేసిన తోరాన్ని చేతికి కట్టుకొంటారు. గరుడ ప్రతిమను పూజిస్తారు. భక్తి శ్రద్ధలతో వ్రతకథ వింటారు. ఈరోజు చలిమిడి మాత్రమే తింటారు. తెల్లవారి బ్రహ్మచారికి భోజనం పెడతారు. పాయసం గిన్నె, వస్త్రం, దక్షిణలు దానంగా సమర్పించుకుంటారు.
సెల్: 9989872723
- డా. రంగి కమల