09-08-2024 12:00:00 AM
పునర్జన్మకు కర్మ బంధమే కారణం. కర్మ క్షయం అయినపుడే పునర్జన్మ రహితమైన ముక్తి. ఈ పునర్జన్మ సిద్ధాంతం భారతీయ తత్త్వశాస్త్రంలో ముఖ్యమైన విషయం. శరీరం అనిత్యం, జీవుడే పునర్జన్మనెత్తే శాశ్వత తత్త్వం. అయితే, ఇక్కడ జీవుడు మరొక జన్మనెత్తుతాడని అన్నప్పుడు ‘ఆ జన్మ ఏమై ఉంటుంది?’ అన్న ప్రశ్న వస్తుంది. ఇంద్రియ వ్యాపారం క్షీణించిన తర్వాత ఇంద్రియాలు మనసును చేరుకుంటాయి. అవసాన కాలంలో మనసుకు కొన్ని కోరికలు, సంకల్పాలు ఉంటాయి. మనసు, ఇంద్రియాలు, కోరికలతోసహా ఉదానంలో కలిసి ముఖ్యప్రాణం చేరుకుని అక్కడ నుండి సూక్ష్మశరీరంగా నిష్క్రమిస్తుంది.
ఎప్పుడైతే ముఖ్యప్రాణం కూడా నిష్క్రమించిందో శ్వాస ఆగిపోతుంది. ఆ జీవి అంతిమ కాలంలో మనసులో సంకల్పించిన దానికి అనుగుణమైన జన్మనెత్తుతాడు. అయితే, ఆ సంకల్పం అతను జీవితంలో ఎలా బతికాడో, ఎంత సంస్కారవంతుడో అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. పాపాత్ముడికి మంచి సంకల్పం, పుణ్యాత్ముడికి చెడు సంకల్పం కలగవని, అలా కలగడం ప్రకృతి విరుద్ధమని గ్రహించాలి. అందువల్ల మన జీవిత కాలంలోనే, అవసాన కాలంలో మంచి సంకల్పం కలగడానికి తగిన ఉత్తమ జీవితాన్ని గడపాలని సారాంశం.
మనం ముఖ్యంగా గమనించ వలసింది ఉచ్చనీచ జన్మలకు మన మనసు, బుద్ధి, వాటి కారణంగా తీర్చిదిద్దబడే మన ప్రవర్తనే కారణమని తెలుసుకోవాలి. మనలోని ఆత్మ పరమాత్మ స్వరూపం గనుక కేవలం సాక్షి మాత్రమే. కనుక, శమదమాది సద్గుణాలతో మనసును బుద్ధిని నియంత్రించుకుని ఉత్తమ జీవితం గడిపితే ఉత్తమ జన్మ, లేకపోతే నీచ జన్మ. ఈ విషయంలో ఆత్మకి బాధ్యత ఏమీ లేదు. మానవుడు స్వప్నావస్థలోకి వెళ్ళినప్పుడు, ఈ దేహేంద్రియాలను వదలి, జాగ్రదావస్థలోనికి వచ్చినపుడు మరల వాటిని స్వీకరించిన మాదిరిగానే, జీవుడు మరణించినవుడు ఈ దేహేంద్రియాలను శాశ్వతంగా వదలి, మళ్ళీ జన్మనెత్తినప్పుడు కొత్త దేహేంద్రియాలను స్వీకరిస్తాడు.
కొత్త వస్త్రాలను ధరించినట్టే..
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృష్ణతి నరో పరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ॥ (భగవద్గీత: 2. 22)
మానవుడు చినిగిన బట్టలను పరిత్యజించి నూతన వస్త్రాలను ధరిస్తున్నట్లు జీవుడు శిథిలమైన శరీరాన్ని పరిత్యజించి మరొక కొత్త శరీరాన్ని స్వీకరిస్తున్నాడని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. చావు పుట్టుకలు ఒక ఇంటినుంచి మరొక ఇంటికి మారడం వంటివి.
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మరణ సమయంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావానికి అనుగుణమైన జన్మ వస్తుంది. ఈ విషయాన్ని ‘భగవద్గీత’ కూడా చెప్పింది.
యం యం వా పి స్మరన్భావం
త్యజంత్యస్తే కలేవరమ్
తం తమేవైతి కౌస్తేయ! సదా తద్భావ భావితః ॥ (భగవద్గీత: 8.6)
అయితే ఉత్కృష్టమైన, పవిత్రమైన భావాలు మనం ప్రయత్నిస్తే వచ్చేవి కావు. జీవితమంతా మనం సత్ప్రవర్తనతో, భక్తి భావంతో, జ్ఞాన విజ్ఞాన సముపార్జనా ధృక్పథంతో ఉత్తమ జీవితం గడిపిన నాడే సద్భావాలు మరణ సమయంలో వస్తాయి. కనుక, వచ్చే జన్మకి ఈ జన్మలోనే బాటలు వేసుకోవాలి.
శ్రీ వేదభారతి’ సౌజన్యంతో..
‘వేదాంత పరిభాష’ నుంచి..
- కళానిధి సత్యనారాయణ మూర్తి