18-09-2025 01:52:59 AM
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలకపాత్ర పోషించిందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17 అని అన్నారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి,
మాట్లాడారు. భూస్వామ్య జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి, కడవెండి, రావులపెంట, శాలిగౌరారం, ఏనెమీదిగూడెం ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయని తెలిపారు. కాగా రాబోయే రోజుల్లో మరింత కష్టపడి నల్లగొండ జిల్లా రైతులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్రపవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు