13-02-2026 12:00:00 AM
విదేశీ మార్కెట్లో పుస్తకం
పెంగ్విన్ సంస్థను విచారించిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం ప్రతినిధులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి12: ప్లాన్తోనే సవరణే పుస్తకం లీక్ అయినట్లు, రక్షణ శాఖ అనుమతుల కంటే ముందే ఈ పుస్తకం గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇదంతా కుట్రపూరితంగానే జరిగినట్లు తెలిపాయి. మాజీ సైన్యాధికారి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన స్వీయ చరిత్ర (మెమోయిర్) ఇంకా ప్రచురణ కాకముందే బయటకు రావడంపై ఆరా తీసేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.
గురువారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ ప్రతినిధులను ఈ అంశంపై విచారించింది. ప్రచురణకు ముందే లీకైన ఈ ఫోర్స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లోని ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లో అమ్మకానికి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ లీకైన కాపీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్(ఐఎస్బీఎన్) ఉండడం చూసి దర్యాప్తు బృందం ఆశ్చర్యపోయింది.
13 అంకెల ఈ నంబర్ను అన్ని అనుమతులు పొంది పబ్లిష్, విక్రయాలకు పంపించే పుస్తకాలకు కేటాయిస్తారు. రక్షణ శాఖ అనుమతి రాకుండానే ఈ పుస్తకానికి ఈ నంబర్ ఉండటం అనేక అనుమానాలు రేకిత్తిస్తోంది. ఇది కేవలం పైరసీ చర్య మాత్రమే కాదని, రక్షణ శాఖ అనుమతులు లేకుండా పుస్తకం మార్కెట్లోకి వచ్చేలా పక్కా ప్రణాళికతో, సమన్వయంతో ఈ లీక్ ఆపరేషన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.తాజా పరిణామాలపై రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు.