13-02-2026 12:00:00 AM
న్యూ ఢిల్లీ, ఫ్రిబ్రవరి 12: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేదికగా అధికార, -ప్రతిపక్ష ఎంపీల మధ్య సంఘర్షణ కొనసాగుతోంది. ఇక ప్రతిపక్ష ఎంపీలకు సంబంధించిన వీడియోలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో వరుసగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు వీడియోలు విడుదల చేయగా తాజాగా స్పీకర్ చాంబర్లో ఓం బిర్లాను విపక్ష ఎంపీలు బెదిరిస్తున్నట్లు ఉన్న వీడియోను విడుదల చేశారు.
లోక్సభలో ప్రధానిని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ ఎంపీలు కుట్ర పన్నారని, విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధానిని సభకు రావొద్దని సూచించినట్లు ఇటీవల స్పీకర్ ఓం బిర్లా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఈ నెల 4వ తేదీన స్పీకర్ చాంబర్లో కాంగ్రెస్ ఎంపీల దురుసు ప్రవర్తన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
20నుంచి-25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా చాంబర్లోకి చొరబడి.. ఆయనను, ప్రధానమంత్రిని దుర్భాషలాడి బెదిరించారని కేంద్రమంత్రి ఆరోపించారు. చట్టవిరుద్ధంగా రికార్డ్ చేసిన వీడియోను షేర్ చేశారని కిరణ్ రిజిజు ఆరోపించారు.
“గౌరవ స్పీకర్ చాంబర్లోకి 20--25 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశించి ఆయనను దుర్భాషలాడి. ప్రధానమంత్రిని బెదిరించినప్పుడు ఒక కాంగ్రెస్ ఎంపీ తీసిన చట్టవిరుద్ధమైన వీడియో క్లిప్ ఇది. మా పార్టీ చర్చలను నమ్ముతుంది. ఎంపీలు భౌతికంగా బెదిరించడాన్ని ఎప్పుడూ ప్రోత్సహించదు.’ అని రిజిజు ఎక్స్లో రాశారు.