నయన్‌తో టాక్సిక్ టీమ్ టాక్స్

06-05-2024 12:05:00 AM

కథానాయకుడు యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి యష్ నిర్మించనున్న ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉండగా, నటీనటలు ఎంపికకు సంబంధించి ఇంకా కసరత్తులు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ సహా మరో కీలక పాత్ర కోసం ఇద్దరు కథానాయికలను ఎంపిక చేయాల్సి వుంది. ఆ మధ్య కథానాయికగా కియారా, శృతి హాసన్ పేర్లు వినిపించినా నేటి వరకు దానిపై చిత్ర బృందం నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో ‘టాక్సిక్’ టీమ్ నయనతారతో టాక్స్ నడుపుతున్నారట. మరోవైపు ఈ సినిమాలో కథానాయకుడి సోదరి పాత్ర అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో ఆ పాత్రలోనూ యష్‌కు ధీటైన నటి కోసం చిత్ర వర్గాలు అన్వేషిస్తున్నాయి. తొలుత ఈ పాత్రలో బాలీవుడ్ నటి కరీన కపూర్ కనిపించనున్నారని అనుకున్నా ఆమె డేట్స్ సర్దుబాటు విషయమై తప్పుకున్నారని బి వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్ర కోసమే గీతూ, నయన్‌తో చర్చలు సాగిస్తున్నారట. పాత్ర తీరు తెన్నులు తెలుసుకున్న నయనతార సుముఖంగానే స్పందించిన్నట్టు తెలుస్తోంది.