14-06-2025 12:44:34 AM
- పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాక విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయరంగం పట్ల నిబద్ధత లేదని, విద్యా వ్యవస్థ పట్ల బాధ్యత లేదని మండిపడ్డారు.
వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతు భరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదని, పాఠశాలలు ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అరకొర రుణమాఫీ, ఆచూకీ లేని రైతు భరోసా, అందని రైతు బీమా, ప్రాజెక్టులు పడావు పడే పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా మారితే.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తోందని విమర్శించారు. వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాల ఏర్పాటుతో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తెలంగాణ విద్యా వ్యవస్థ ఏడాదిన్నరలో అవస్థలు ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. జాగో తెలంగాణ జాగో అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు.