25 February, 2026 | 8:34 AM

డీఎంహెచ్‌ఓ అనుమతి లేకుండా కొత్త హెల్త్ ఫెసిలిటీ ప్రారంభించకూడదు

25-02-2026 01:24 AM

కామారెడ్డి అర్బన్ ,ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ (ౄRA) కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో డిఆర్‌ఏ కమిటీ చైర్పర్సన్,  కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్  ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డాక్టర్ రవీందర్ గౌడ్ కమిటీకి నివేదిక సమర్పిస్తూ, ఇప్పటివరకు జిల్లాలో 178 ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్లు, ఫిజియోథెరపీ సెంటర్లు, స్కాన్ సెంటర్లకు అనుమ తులు మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా, కొత్త అనుమతులు , రీన్యువల్స్ కోసం 36 ఆసుపత్రుల నుండి దరఖాస్తులు అందినట్లు వివరించారు.

వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు దరఖాస్తులపై స్థల పరిశీలనలు నిర్వహించాలని ఆదేశించగా, తనిఖీల అనంతరం చెక్లిస్టులను కార్యాలయానికి సమర్పించారు. అందులో ఐదు రీన్యువల్ దరఖాస్తులు ,ఇరవై కొత్త ఆసుపత్రుల దరఖాస్తులు Clinical Establishments Act, 2010 ప్రకారం అవసరమైన పత్రాలతో సమర్పించబడి ఉన్నట్లు నిర్ధారించబడింది. మిగతా పదకొండు ఆసుపత్రులు సరైన పత్రాలు సమర్పించనందున వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యులతో చర్చించిన అనంతరం ఐదు రీన్యువల్స్, ఇరవై కొత్త ఆసుపత్రులకు అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించారు.

జిల్లా డీఎంహెచ్‌ఓ అనుమతి లేకుండా ఎటువంటి కొత్త హెల్త్ ఫెసిలిటీ ప్రారంభించకూడదని, నడపకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో పదివేల నుండి యాభై వేల రూపాయల వరకు జరిమానా విధించడం లేదా ఆ సంస్థలను సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి,  ఐఎంఏ అధ్యక్షుడు కార్యదర్శి డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మల్లికార్జున్, అడిషనల్ ఎస్పీ, బి.ఓలు డాక్టర్ వెంకటస్వామి, డాక్టర్ విద్య, డాక్టర్ రోహిత్, డెమో వేణుగోపాల్, చలపతి తదితరులు పాల్గొన్నారు.