22-10-2025 07:24:17 PM
అమరావతి: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ఇండియాపై కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం బుధవారం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాకు చెందిన వీరేష్ అనే యువకుడు ఇటీవల అమెజాన్లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15ప్లస్ ఆర్డర్ పెట్టాడు. కానీ అమెజాన్ సంస్థ ఐఫోన్ 15ప్లస్కు బదులు ఐక్యూ ఫోన్ డెలవరీ చేసింది. వెంటనే బాధితుడు అమెజాన్ కస్టమర్ కేర్ను సంప్రదించాడు. ప్రతిసారి కొత్త ప్రతినిధి మాట్టాడడం, మేము మీ సమస్యను పరిశీలిస్తున్నామని చెప్పడంతో విసిగిపోయిన యువకుడు చివరికి కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు.
ఫిర్యాదులో, తాను చేసిన చెల్లింపులు, ఆర్డర్ వివరాలు, అమెజాన్తో జరిగిన మెయిల్, చాట్ రికార్డులు అన్నీ సమర్పించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరమ్ తీర్పు స్పష్టంగా ఇచ్చింది. అమెజాన్ సంస్థ బాధితుడైన వీరేష్ కు తక్షణమే ఐఫోన్ 15 ప్లస్ డెలివరీ చేయాలని, చేయని పక్షంలో రూ.80 వేలు రీఫండ్ చేసి, మరో రూ.25వేలు చెల్లించాలని కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం ఆదేశించింది. ఫోరమ్ ఆదేశాలకు అమెజాన్ సంస్థ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. చట్టాన్ని నిర్లక్ష్యం చేయడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకపోవడం అత్యంత సీరియస్ తప్పిదమని పేర్కొంటూ, అమెజాన్పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను నవంబర్ 21 కు వాయిదా వేసింది.